న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్టమర్ల మొబైల్ ఫోన్ నంబర్లకు మెసేజ్లు పంపుతున్నారు. ‘ప్రియమైన ఖాతాదారుడా.. మీ ఎస్బీఐ బ్యాంక్ డాక్యుమెంట్ల గడువు తీరిపోయింది. మీ ఖాతాను బ్లాక్ చేశాం. మీ డాక్యుమెంట్లను వెంటనే అప్డేట్ చేసుకోండి’ అంటూ మోసపూరిత సందేశాలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? అన్న కోణంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విచారణ చేసింది. ఇది నకిలీ సందేశమని తేలింది. ఈ తరహా మెసేజ్లు ఈ-మెయిల్ అడ్రస్లకూ పంపుతుండటం గమనార్హం. ఈ సందేశాలపై report.phishing<\@> sbi.co.inకు ఫిర్యాదు చేయాలని కూడా పీఐబీ ప్రజలను కోరింది.
లింక్పై క్లిక్ చేయవద్దు
ఈ నకిలీ మెసేజ్కు ఓ లింక్ కూడా ఉంటుంది. వివరాల అప్డేట్ కోసం ఈ లింక్పై క్లిక్ చేయమని మోసగాళ్లు కోరుతారు. అయితే క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో నగదు అపహరణకు గురికావచ్చని, విలువైన సమాచారం నేరగాళ్లకు చిక్కే ప్రమాదం కూడా ఉంటుందని పీఐబీ స్పష్టం చేసింది. కనుక వెంటనే ఈ తరహా మెసేజ్లను డిలిట్ చేయాలని సూచించింది. బ్యాంక్ అధికారులమని మీ వివరాలు చెప్పాలంటూ ఎవరైనా ఫోన్ చేసినా స్పందించవద్దన్నది. క్రెడిట్/డెబిట్ కార్డుల నంబర్లు, ఐడీలు, పాస్వర్డ్లను వెల్లడించవద్దన్నది. సందేహాలుంటే దగ్గర్లోని బ్యాంక్ను సంప్రదించి చెక్ చేసుకోవాలని సూచించింది.