కంది, ఏప్రిల్ 30: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్(ఐఐటీహెచ్) డీఎన్పీల సంయుక్త పరిశోధనలకు వేదికైంది. డై నిప్పోన్ ప్రింటింగ్ కంపెనీ లిమిటెడ్ (డీఎన్పీ) దేశంలోని తొలి పరిశోధనా అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని గురువారం ఐఐటీహెచ్లో ప్రారంభించింది. ఐఐటీహెచ్ టెక్నాలజీ రీసెర్చ్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆరోగ్య రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారత్-జపాన్ ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నది.
ఈ పరిశోధనా కేంద్ర ప్రారంభోత్సవంలో జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహాషి, డీఎన్పీ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒసాము నకమూరా, ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితోపాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ రూపకల్పనతో పాటు ఆరోగ్య రంగంలో ఏపీఎల్ఎస్ తయారీ ప్రక్రియలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పరిశోధనలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీహెచ్లో ఈ పరిశోధనా కేంద్రం ప్రారంభించుకోవడం గ్లోబల్ పరిశ్రమ-అకాడమియా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ముందడుగు అని పేర్కొన్నారు. దేశీయ, గ్లోబల్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుగుతాయని తెలిపారు.