Reliance-Disney | భారత్లో మీడియా రంగ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్లో విలీనం చేసేందుకు రిలయన్స్, వాల్ట్ డిస్నీ కో మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్లు సమాచారం. రెండు కంపెనీల విలీనం తర్వాత రిలయన్స్ సంస్థకు 61 శాతం, మిగిలిన 39 శాతం వాటా వాల్ట్ డిస్నీ చేతిలో ఉంటుందని ప్రముఖ దిన పత్రిక బ్లూంబర్గ్ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు ఎటువంటి ప్రకటన చేయకున్నా.. విలీనం తర్వాత రెండు సంస్థల మధ్య నగదు-షేర్ల బదిలీ జరుగుతుందని తెలుస్తున్నది. బ్రాడ్ కాస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ‘టాటా ప్లే లిమిటెడ్’లో డిస్నీ సంస్థకు గల మైనారిటీ వాటాను రిలయన్స్ కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు.
2022లో వాల్ట్ డిస్నీని పక్కకు నెట్టివేసి ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాల్ట్ డిస్నీకి తన సబ్ స్క్రైబర్లను కాపాడుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు దేశీయంగా పలు వినోద, మీడియా వ్యాపారాల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లను ఆకర్షించిన దేశీయ మీడియా, వినోద రంగంపై పట్టు సాధించేందుకు రిలయన్స్ తహతహలాడుతున్నది. వాల్ట్ డిస్నీ, రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థ దేశీయ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.