హైదరాబాద్, అక్టోబర్ 26: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్… ప్రస్తుత పండుగ సీజన్లో తెలంగాణలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. రాష్ట్రంలో టీవీల విక్రయాలు రెండు రెట్లు పెరగగా, 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 60 శాతం చొప్పున పెరిగాయని అమెజాన్ ఇండియా డైరెక్టర్ రంజిత్ బాబు తెలిపారు.
నెలవారి చెల్లింపులపై ఎలాంటి వడ్డీ విధించకపోవడంతో కస్టమర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారని, ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, అతిపెద్ద స్క్రీన్ టీవీలను ఎంచుకున్నట్టు హైదరాబాద్లోని ఐఐటీలో జరిగిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ అరెనా(ఏఎక్స్ఏ) కార్యక్రమంలో ఆయన చెప్పారు. ముఖ్యంగా సామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, నార్జో, షియోమీ వంటి అంత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ఫోన్ల బ్రాండ్లకు కస్టమర్ల నుంచి మద్దతు లభించింది.