న్యూఢిల్లీ, జనవరి 11: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక ఈసారి దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. నిరుడుతో చూస్తే 19.55 శాతం పెరిగాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు రిఫండ్స్ రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు తేలింది. అంతకుముందుతో పోల్చితే 58.74 శాతం ఎక్కువ. కాగా, వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు పెరగడం కలిసొచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఆదాయం పన్ను వాటా 19.72 శాతానికి, వ్యక్తిగత ఆదాయం పన్ను వాటా 30.46 శాతానికి పెరిగాయి. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వీటి వాటా వరుసగా 18.33 శాతం, 20.97 శాతంగా ఉన్నాయి. ఇదిలావుంటే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.2 లక్షల కోట్లుగా ఉంటాయని నిరుడు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది. తాజా గణాంకాలతో ఇందులో 86.68 శాతం సాధించినైట్టెంది.