Direct tax collection | గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20 శాతం పెరిగి రూ.15.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఇది 80 శాతం. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన గ్రోత్ నమోదవుతున్నది. ఈ నెల 10 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా రూ.18.38 లక్షల కోట్లు. గతేడాది (2022-23)తో పోలిస్తే 17.30 శాతం ఎక్కువ’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లలో నికర వసూళ్లు రూ.15.60 లక్షల కోట్లుని సీబీడీటీ వివరించింది. గతేడాదితో పోలిస్తే 20.25 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 80.23 శాతం పెరుగుదల నమోదైంది. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 10 వరకు రూ.2.77 లక్షల కోట్ల రీఫండ్స్ జరిగాయి. కార్పొరేట్ ఇన్ కం టాక్స్ (సీఐటీ)లో స్థూల ఆదాయం వసూళ్లు, వ్యక్తిగత ఆదాయం పన్ను (పీఐటీ) వసూళ్లలో స్థిరంగా గ్రోత్ రికార్డవుతున్నది. సీఐటీ వసూళ్లలో 9.16 శాతం, పీఐటీ వసూళ్లలో 13.57 శాతం గ్రోత్ నమోదైంది. ఐటీ రీఫండ్స్ తర్వాత సీఐటీ వసూళ్లలో నికర గ్రోత్ 13.57 శాతం, పీఐటీ వసూళ్లలో నికర గ్రోత్ 26.91 శాతం అని సీబీడీటీ వివరించింది.