Diamond Workers Layoffs | బంగారం ఆభరణాలైనా.. వజ్రాలైనా నగిషీలు చెక్కితేనే అందరినీ.. ప్రత్యేకించి మహిళామణులను ఆకట్టుకుంటాయి. కానీ వజ్రాలకు నగిషీలు చెక్కే కార్మికుల పరిస్థితి.. ప్రత్యేకించి సూరత్ డైమండ్ పరిశ్రమలో పని చేస్తున్న వర్కర్ల పరిస్థితి కడు దయనీయంగా మారింది. పీస్ వర్క్ ప్రకారం పని చేసే డైమండ్ వర్కర్ల కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆర్థిక మాంద్యం పట్ల అనవసర ఆందోళన కూడా కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రెండ్రోజుల క్రితం విపుల్ జింజాలా అనే డైమండ్ వర్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని నెలలుగా తన సోదరుడు చేతిలో డబ్బులేక ఇబ్బందుల పాలవుతున్నాడని మృతుడి సోదరుడు పరేష్ మీడియాకు చెప్పాడు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతోపాటు వేతనాలు పడిపోవడంతో కుటుంబ జీవనం కష్టతరంగా మారి ఉండొచ్చునని పరేశ్ అన్నాడు.
ఈ విపుల్ జింజాలా ఒక్కరే కాదు.. వేలాది మంది డైమండ్ వర్కర్లు తమ కుటుంబ అవసరాలు తీర్చలేక సతమతం అవుతున్నారు. ఇంటి రుణాలు లేదా వెహికల్ లోన్ల ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ కుటుంబ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక వారంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నారని సూరత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేశ్ జిలారియా చెప్పారు.
సూరత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ అంచనా ప్రకారం.. కొన్ని నెలలుగా డైమండ్ పాలిషింగ్ కంపెనీలు ఉత్పత్తి తగ్గించేశాయి. కొన్ని చిన్న యూనిట్లు మూత పడ్డాయి. ఫలితంగా దాదాపు 10 వేల మంది డైమండ్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారని ఈ యూనియన్ చెబుతున్నది. డైమండ్ పరిశ్రమలో ఖచ్చితంగా కార్మిక చట్టాలు అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తున్నది. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, ప్రావిడెండ్ ఫంట్, నిర్ణీత పని గంటల విధానం అమలు చేయాలంటున్నది. ఇతర కార్మికుల మాదిరిగానే సామాజిక, ఆరోగ్య భద్రతా బెనిఫిట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని, డైమండ్ తయారీ, పాలిషింగ్ యూనిట్ల యాజమాన్యాలను కోరుతున్నది.
డైమండ్ రంగంలో పని చేసే కార్మికుల పేర్లు ఉద్యోగులుగా రిజిస్టర్ కావు. శాలరీ స్లిప్ ఉండదు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఉండదు. ఎటువంటి సామాజిక భద్రతా పథకాలు అమలు కావు.. కనుక వారికి ఏ ఇతర బెనిఫిట్లు అందవు అని రమేష్ జిలారియా ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా తదితర దేశాల నుంచి దిగుమతులు 18 శాతం తగ్గడంతో క్రిస్మస్ సీజన్ నుంచి 20-21 శాతం ప్రొడక్షన్ తగ్గిందని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ప్రమోషన్ కౌన్సిల్ రీజనల్ చైర్మన్ విజయ్ మంగూకియా అంగీకరించారు. 2022 డిసెంబర్లో నగిషీలు చెక్కిన డైమండ్ల ఎగుమతులు 2356.70 మిలియన్ల డాలర్లు. 2021 డిసెంబర్లో 2905 మిలియన్ డాలర్ల విలువైన డైమండ్ల ఎగుమతులు జరిగాయి. అంటే 2021తో పోలిస్తే గతేడాది 18.90 శాతం ఎగుమతులు పడిపోయాయి.