న్యూఢిల్లీ, మే 27: మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల్ని అరికట్టేక్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి చేసే కొన్ని క్యాటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ ధృవపత్రాన్ని తీసుకోవాలంటూ పోస్టల్ శాఖ తన అధికారులకు తాజాగా ఒక సర్క్యులర్ జారీచేసింది. నేరగాళ్లు పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ను ఉపయోగించుకోకుండా, కేవైసీ నిబంధనల్ని పాటించి ఖాతాదారుల స్థాయిని అవగాహన చేసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను సర్క్యులర్లో పొందుపర్చింది. ఖాతాను తెరిచేటపుడు, సేవింగ్స్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసేటపుడు పెట్టుబడి చేసే మొత్తం, ప్రస్తుత ఖాతాలో జమచేసే మొత్తం ఆధారంగా ఖాతాదారులను మూడు క్యాటగిరీలుగా విభజించింది. అవి..
తక్కువ రిస్క్: పెట్టుబడి లేదా ఖాతాల్లో నిల్వ లేదా కాలపరిమితి ముగిసిన తర్వాత అందుకునే మొత్తం రూ.50,000 మించనివారు.
మధ్యతరహా రిస్క్: అన్ని ఖాతాలు, పొదుపు సర్టిఫికెట్లలో పొదుపు లేదా మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తం రూ. 50,000 నుంచి రూ. 10 లక్షలకు మించనివారు.
అధిక రిస్క్: ఖాతాలు, సర్టిఫికెట్లలో బ్యాలెన్స్ రూ.10 లక్షల లోపు ఉండి, మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తం రూ.10 లక్షలకు మించినవారు.
అన్ని క్యాటగిరీల వారికి ఇవి తప్పనిసరి
ఫొటోలు: రెండు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాలి. జాయింట్ ఖాతా అయితే ఆ ఖాతాదారులు అందరూ ఫొటోగ్రాఫ్లు సమర్పించాలి.
గుర్తింపు రుజువు
ఆధార్: ఖాతా తెరిచినపుడు ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసినట్లయితే ఈ రుజువును ఇచ్చి, అటుతర్వాత ఆరునెలల్లోగా ఆధార్ నంబర్ను సమర్పించాలి.
పాన్ నంబర్: ఖాతా తెరిచినపుడు పాన్ కార్డు ఇవ్వనివారు కొన్ని సందర్భాల్లో రెండు నెలల లోపు సంబంధిత పోస్టాఫీసులో సమర్పించాలి. పాన్ సమర్పించాల్సిన సందర్భాలు..
1. ఖాతాలో నిల్వ ఏ సమయంలోనైనా రూ. 50,000 దాటితే
2. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఖాతాలో జమ చేసిన మొత్తం రూ. లక్ష మించితే
3. ఒక నెలలో ఖాతా నుంచి విత్డ్రాయిల్స్, బదిలీలు 10 వేలు మించితే
పెట్టుబడి చేసిన నిధులు ఏ మార్గంలో అందాయో తెలియపర్చే ధృవపత్రాన్ని సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లలో వేటినైనా రుజువు పత్రంగా అంగీకరిస్తారు.
1. బ్యాంక్/పోస్టాఫీస్ ఖాతా స్టేట్మెంట్
2. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్లు
3. ఆస్తి విక్రయ పత్రం/బహుమతిగా లభించినట్టు తెలిపే పత్రం/ విల్లు/ వారసత్వపు సర్టిఫికెట్
4. ఆదాయాన్ని/నిధులు సమకూరిన మార్గాన్ని తెలియపర్చే ఏ ఇతర పత్రాన్ని అయినా సమర్పించవచ్చు.