Demat Accounts | దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం ఏరోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్తోపాటు మ్యూచువల్ ఫండ్స్, ఇతర లావాదేవీలు జరిపేందుకు ప్రారంభించే డీమ్యాట్ ఖాతాలూ పెరుగుతున్నాయి. గత నెలలో ఇన్వెస్టర్లు తెరిచిన డీమ్యాట్ ఖాతాలు రికార్డు నెలకొల్పాయి. 2023 డిసెంబర్ నెలలో కొత్తగా 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేయడంతో మొత్తం 13.93 కోట్ల ఖాతాలకు చేరాయి. అంతకుముందు నవంబర్లో మదుపర్లు 28 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించారు. నవంబర్ గణాంకాలతో పోలిస్తే డిసెంబర్ నెలలో 50 శాతానికి పై చిలుకు కొత్త ఖాతాలు ఓపెన్ చేశారు. ఈక్విటీ మార్కెట్లలో స్టాక్స్ ధరల పెరుగుదల నిష్పత్తికి అనుగుణంగా డీమ్యాట్ ఖాతాలు తెరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. బుల్ మార్కెట్ రోజురోజుకు కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుండగా, యాక్టివ్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తగ్గుతున్నారు.
2023లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 20 శాతం పెరుగుదలతో రికార్డ్ గరిష్టాలు నమోదు చేసింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 50-55 శాతం పెరిగాయి. 2022లో భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి 17 బిలియన్ డాలర్లు ఉపసంహరిస్తే 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచాయి. భారత్ మార్కెట్లో గత ఎనిమిదేండ్లుగా ఎఫ్ఐఐలు 51.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. కేవలం రెండేండ్లు మాత్రమే దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.