హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కమర్షియల్ ఆఫీస్ స్పేస్కు హాట్కేకులా మారిన హైదరాబాద్ నగరంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నానాటికీ గణనీయంగా పెరుగుతున్నది. దీంతో రెంటల్ వాల్యూస్ సైతం పైపైకి పోతున్నాయి. ఈ విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్ ఆకర్షణీయ వృద్ధిని సాధిస్తోంది.
గ్రేడ్-ఏ కార్యాలయ అద్దె విలువ పెరుగుదలలో దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్టీ సంస్థ అనరాక్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నగరంలో గతంతో పోల్చితే 8 శాతం వృద్ధి నమోదైంది. చెన్నై 10 శాతం పెరుగుదలను నమోదు చేసి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, బెంగళూరు, పుణె, కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాలున్నాయి.
హైదరాబాద్లో సగటు నెలవారీ కార్యాలయ అద్దె విలువ గత ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చదరపు అడుగుకు రూ.61గా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధంలో రూ.66కి పెరిగింది. 8 శాతం వృద్ధి ఉందని అన్రాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్, ప్రశాంత్ ఠాకూర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే సమీప కాలంలో హైదరాబాద్.. బెంగళూరును అధిగమించనుందన్నారు.
కో-వర్కింగ్ స్పేస్కు డిమాండ్..
గ్లోబల్ మార్కెట్ నుంచి సవాళ్ల ప్రభావం.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కమర్షియల్ స్పేస్పై పడింది. ప్రతికూల ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ మెజార్టీ మెట్రో నగరాల్లో కమర్షియల్, ఐటీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గత కొంతకాలంగా తగ్గుతున్నట్టుగా తేలింది. ఈ సమయంలోనే కో-వర్కింగ్ స్పేస్కు అన్ని మెట్రో నగరాల్లో డిమాండ్ పెరిగిందనీ, గడిచిన ఏడాది కాలంలోనే ఐటీ రంగంలో కో-వర్కింగ్ స్పేస్ డిమాండ్ 11 శాతం వృద్ధి ఉందని అనరాక్ పేర్కొంది. కంపెనీలు మల్టీ మోడల్ వర్కింగ్ పాలసీకి జై కొడుతున్నాయన్నది.