Byjus | ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్ సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ముగ్గురు డైరెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు సమాచారం. మరోవైపు, బైజూస్ ఆడిటర్ డెల్లాయిట్ హాస్కిన్స్ మూడేండ్ల ముందే పక్కకు తప్పుకున్నది. రాజీనామా చేసిన డైరెక్టర్లలో పీక్ ఎక్స్వీ పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రవి శంకర్, చాన్ జుకర్ బర్గ్ ఇన్సియేటివ్ వివియన్ వూ, ప్రోసెస్ కంపెనీ రస్సెల్ డ్రెయిన్ స్టాక్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. కంపెనీ ఫౌండర్ రవీంద్రన్తో విభేదాలే దీనికి కారణమని భావిస్తున్నారు. కంపెనీ నిర్వహణ విషయంలో రవీంద్రన్తో ఆ ముగ్గురు విభేదిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు వినికిడి. అయితే వీరి రాజీనామాలను కంపెనీ ఆమోదించలేదని సంబంధిత వర్గాల కథనం. డైరెక్టర్ పదవులకు రాజీనామాపై అటు డైరెక్టర్లు గానీ, ఇటు బైజూస్ యాజమాన్యం గానీ అధికారికంగా స్పందించలేదు.
ఇప్పటికే బైజూస్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు రుణాల ఎగవేత సమస్య వల్ల ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో జాప్యం జరుగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బైజూస్ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ముగ్గురు డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామాకు దిగడం ఆసక్తికర పరిణామం. జీవీ రవిశంకర్, వివియన్ వూ, రస్సెల్ డ్రెయిన్ స్టాక్ ప్రస్తుతం కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.
ఇదిలా ఉంటే బైజూస్ అడిటర్ బాధ్యతల నుంచి డెల్లాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ పక్కకు తప్పుకున్నది. కంపెనీతో మూడేండ్ల కాంట్రాక్టు ఒప్పందం ఉన్నా, ముందుగానే డెల్లాయిట్ హాస్కిన్స్ వైదొలగడం ఆసక్తి కర పరిణామం. గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యమే కారణమని ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరించింది. 2016 నుంచి బైజూస్ కు డెలాయిట్ ఆడిటర్గా సేవలందిస్తున్నది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన మరో ఐదేండ్ల కాలానికి డెల్లాయిట్ హస్కిన్స్ను ఆడిటర్ గా బైజూస్ నియమించుకున్నది. తాజా డెల్లాయిట్ నిర్ణయంతో తమ ఆడిటర్గా బీడీఓను ఐదేండ్ల కాలానికి బైజూస్ నియమించుకున్నది.