న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సహా పలు కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్, షేర్చాట్ వంటి పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా డెలివరీ ప్లాట్ఫాం డుంజో తమ సిబ్బందిలో మూడు శాతం మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించనున్నట్టు వెల్లడించింది.
బ్లింకిట్, స్విగ్గీ, విఫాస్ట్ తరహాలో ఆన్లైన్ డెలివరీ సేవలు అందిస్తున్న బెంగళూర్కు చెందిన స్టార్టప్ డుంజో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా లేఆఫ్స్ నిర్ణయం ప్రకటించింది. ఈ సంక్లిష్ట సమయంలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు కంపెనీ బాసటగా నిలుస్తుందని కంపెనీ సీఈఓ, సహ వ్యవస్ధాపకులు కబీర్ బిశ్వాస్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం క్లిష్టమైనదే అయినా చిట్టచివరి అవకాశంగా లేఆఫ్స్ తప్పలేదని పేర్కొన్నారు. కాగా, 2022 ఆర్ధిక సంవత్సరంలో డుంజోకు రూ .464 కోట్ల నికర నష్టం వాటిల్లింది.