Ratan Tata | పేరొందిన పారిశ్రామికవేత్త రతన్టాటా ( Ratan Tata ) కు భారత్ రత్న ( Bharat Ratna ) అవార్డు ఇవ్వాలని కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలన్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను అనుమతించేందుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్చావ్లాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఒక వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారత్రత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించలేదని స్పష్టం చేసింది.
ఇదేమి పిటిషన్? (భారత్ రత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి) కోర్టు మార్గదర్శనం చేయగలదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. కనీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని న్యాయస్థానాన్ని పిటిషనర్ అభ్యర్థించారు. దీనిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి కోర్టు జోక్యం ఎక్కడ జోక్యం చేసుకోవాలి.. అని ప్రశ్నించారు. ఈ పిల్ను కొట్టి పారేస్తామని న్యాయస్థానం ప్రకటించడంతో పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
జాతికి జీవితాంతం అవిశ్రాంతంగా సేవలందిస్తున్న రతన్టాటా.. భారత్రత్న అవార్డుకు అర్హుడని పేర్కొంటూ రాకేశ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్ కోసం పరితపిస్తున్న లక్షల మంది ప్రజలకు రతన్టాటా జీవితం స్ఫూర్తిదాయకం అని, అసాధారణ ప్రతిభా పాటవాలు గల పారిశ్రామికవేత్త అని పిటిషనర్ పేర్కొన్నారు.