NSE Co-Location Scam | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ కం సీఈవో చిత్ర రామకృష్ణకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు ఏడు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్ర రామకృష్ణను విచారించేందుకు 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి సంజీవ్ అగర్వాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించింది.
చిత్ర రామకృష్ణ శనివారం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను జడ్జి సంజీవ్ అగర్వాల్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు రోజులు విచారించిన తర్వాత ఆదివారం చిత్రను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. అదృశ్య యోగిగా అనుమానిస్తున్న ఆనంద్ సుబ్రమణ్యన్ను గుర్తించడానికి చిత్ర రామకృష్ణ నిరాకరించడం గమనార్హం.
ఇదే కేసులో ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ కం ఎండీ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్ను కూడా న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. చెన్నైలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐటీ శాఖ అధికారులు ఇంతకుముందు చిత్ర రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యన్ నివాసాల్లో సోదాలు చేసి, కీలక ఆధారాలు గల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై సెబీ కూడా దర్యాప్తు చేస్తున్నది.