హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 : హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్ కేంద్రాన్ని తాజాగా ఏర్పాటు చేసింది. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఎస్ఎల్ఎన్ వన్ వెస్ట్లో ఏర్పాటైన ఈ నూతన సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో డాటా సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, రవాణా ఇతర ప్రభుత్వ విభాగాలలో డాటాను ఉపయోగించి ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు, స్టార్టప్లతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
వ్యాపార విధానం భేష్
నగరంలోనే మొట్టమొదటి డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్ కంపెనీ గ్రామినర్ అని సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నవీన్ గట్టు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ సేవలను విస్తరించామన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు అద్భుతమని కొనియాడారు. ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, వనరులు తమ సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రెండేండ్లలో 500లకుపైగా ఉద్యోగావకాశాలు తమ కంపెనీలో కల్పిస్తామన్నారు. గ్రామినర్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ మ్యాట్ ఫెర్రీ మాట్లాడుతూ.. హైదరాబాద్ కార్యాలయంలో సుమారు 250 మంది డాటా సైంటిస్టులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో టెర్మినస్ గ్రూప్ చైర్మన్ ఎస్పి రెడ్డి, గ్రామినర్ కంపెనీ వ్యవస్థాపకులు రవి ఐ రెడ్డి, సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయం సిరికొండ, సీనియర్ మేనేజర్ గిరీష్ అన్నవరపు, ఐటీ అధిపతి సాగర్ యల్లిన తదితరులు పాల్గొన్నారు.