Visa on Data Localisation | వివిధ బ్యాంకుల ఖాతాదారుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డు డేటా స్థానికంగా భద్రపర్చాలన్న ఆర్బీఐ ఆదేశాలు ఉత్తమ పరిష్కారం కాదని ఇంటర్నేషనల్ కార్డు సంస్థ వీసా పేర్కొంది. ఖాతాదారుల డేటా భద్రత కోసం స్థానికంగానే దాన్ని భద్ర పర్చాలని ఆర్బీఐ ఇంతకుముందే స్పష్టం చేసింది. దీనిపై వీసా సీఈవో అల్ఫ్రెడ్ ఎఫ్ కెల్లీ జూనియర్ స్పందించారు. అయితే, భారత చట్టాలకు లోబడి తాము సేవలందిస్తామని శుక్రవారం చెప్పారు.
డేటా లోకలైజేషన్ విషయమై వీసా ప్రత్యర్థులు మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ సంస్థలు ఆర్బీఐ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మాస్టర్ కార్డ్, అమెరికా ఎక్స్ప్రెస్ సంస్థలు కొత్తగా కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలికంగా నిషేధించింది. ఈ రెండు సంస్థలపై జరిమానా కూడా విధించింది. శుక్రవారం గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో కెల్లీ మాట్లాడుతూ భారత్ వంటి కొన్ని దేశాలు తమ ఖాతాదారుల డేటా స్థానికంగా భద్ర పర్చాలని నిర్ణయించాయి. కానీ ఇది తప్పనిసరిగా సరైన పరిష్కారం కాదని అన్నారు.
అయితే భారత్ చట్టాలకు, నిబంధనలకు లోబడి తమ సంస్థ పని చేస్తుందన్నారు కెల్లీ ఆల్ఫ్రెడ్. గతేడాదితో పోలిస్తే 40 శాతం వృద్ధి చెందిందని, ప్రస్తుతం భారత్ మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉందన్నారు. ప్రస్తుతం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ ప్లాట్ఫామ్ విజయవంతంగా పని చేస్తున్నది. కానీ ఎన్పీసీఐ సారధ్యంలోని యూపీఐ ప్లాట్ఫామ్ వల్ల తమకు ముప్పని భావించడం లేదని కెల్లీ చెప్పారు.