Home Sales | గతేడాదితో పోలిస్తే 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. కరోనా రెండో వేవ్ తర్వాత ఇండియాలో ఇండ్ల కోసం ఆన్లైన్లో అన్వేషణ ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. సూరత్, పాట్నా, కోయంబత్తూర్.. టాప్ -20 సిటీలో చేరాయి. ఇండ్ల కొనుగోలు కార్యకలాపాలను నిర్ణయించేందుకు దేశవ్యాప్తంగా 42 నగరాల పరిధిలో ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) సర్వే జరిపింది.
ఐఆర్ఐఎస్ సర్వే ప్రకారం డబుల్ బెడ్రూమ్, త్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లు రూ.50 లక్షలు పలుకుతున్నాయి. ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లస్ ఇండ్లకోసం కొనుగోలు దారులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టేందుకు సిద్ధ పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి నిరంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో విశాలమైన ఇండ్ల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆశ్చర్యకరంగా ఇండ్ల ధరలు 75 శాతం కూడా పెరిగాయి. అంటే రూ.1-2 కోట్ల వరకు పలుకుతున్నాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే గత త్రైమాసికంలో 18 శాతం ధరలు పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన పోలిస్తే రూ.2 కోట్ల విలువ గల ఇండ్ల విక్రయాలు 62 శాతం ఎక్కువయ్యాయి. క్వార్టర్-క్వార్టర్ ప్రాతిపదికన 19 శాతం ఎక్కువయ్యాయి.
ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు చారిత్రక స్థాయిలో తగ్గిపోవడం, ఫెస్టివ్ ఆఫర్స్, బిల్డర్ల డిస్కౌంట్లు, రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్, మహారాష్ట్రతోపాటు ఢిల్లీ ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించేయడం కూడా ఇండ్ల కొనుగోళ్లు పెరగడానికి కారణమని తెలుస్తోంది. మెరుగైన వసతులతో ఎక్కువ స్పేస్ గల ఇండ్లు అవసరం అని ఇండ్ల కొనుగోలుదారులు భావిస్తున్నారని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.