PPF | పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF).. కేంద్రం నిర్వహించే పొదుపు పథకం. ప్రతి ఒక్కరూ తమకు సమీపంలోని పోస్టాఫీసు వద్దకెళ్లి గానీ, తమ బ్యాంకు లావాదేవీలు జరిపే బ్యాంక్ శాఖకు వెళ్లి గానీ పీపీఎఫ్ స్కీంలో ఖాతా ప్రారంభించొచ్చు. సంప్రదాయంగా అత్యధిక మదుపర్లు పీపీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. 18 ఏండ్లు దాటిన ఇండియన్స్ ఎవరైనా ఈ స్కీంలో ఖాతా తెరిచి నిధులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
అకౌంట్ తెరవడానికి ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేదు. కానీ.. ఒక వ్యక్తి ఒక్కటే అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ లేదు. పీపీఎఫ్ స్కీంలో పెట్టుబడిపై ఏడాదికి 7.10 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎక్కువ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నా.. అలా వచ్చే ఆదాయంపై ఆదాయం పన్ను చట్టం కింద పన్ను పే చేయాల్సిందే. కానీ పీపీఎఫ్ స్కీం కింద వచ్చే రాబడిపై ఇన్ కం టాక్స్ ఉండదు.
పీపీఎఫ్ స్కీంలో ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ ప్రాతిపదికన ప్రతి రోజూ రూ.411 వంతున ఏటా రూ.1,50 లక్షలు పెట్టుబడి పెడితే 25 ఏండ్లకే రూ.కోటి సంపాదించొచ్చు. ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రూల్స్ ప్రకారం 15 ఏళ్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. తదుపరి ప్రతి ఐదేండ్లకోసారి పొడిగించొచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్ స్కీంపై అమల్లో ఉన్న 7.10 శాతం వడ్డీ వచ్చే 15 ఏండ్ల పాటు అమల్లో ఉంటే.. ఏటా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేసేవారు మెచ్యూరిటీ టైంలో రూ.40,68,209 వరకు రిటర్న్స్ పొందొచ్చు. మరో ఐదేండ్లు పొడిగిస్తే రూ.66,58,288 రిటర్న్స్ వస్తాయి.
25 ఏండ్లకు రూ.1.03 కోట్ల మనీ వస్తుంది. ఈ స్కీంలో మీరు డిపాజిట్ చేసే మొత్తం రూ.37.50 లక్షలు. మిగతా రూ.65,58,015 వడ్డీరూపంలో వచ్చేదే. అదే 30 ఏండ్ల వరకు పొడిగిస్తే మీరు చేసే మదుపు, దానిపై వచ్చే వడ్డీ ఆదాయంతో కలిపి రూ.1.50 కోట్లు పొందొచ్చు.
పీపీఎఫ్ స్కీంలో గరిష్ఠ మొత్తం పెట్టుబడి పెట్టాలనేమీ లేదు. ఏటా కనీసం రూ.500 డిపాజిట్ కూడా చేయొచ్చు. మధ్యలో ఎప్పుడైనా కనీస డిపాజిట్ చేయకుంటే.. సంబంధిత పీపీఎఫ్ ఖాతా స్తంభింప చేస్తాయి బ్యాంకులు. అటువంటప్పుడు రూ.50 పెనాల్టీ చెల్లించి తిరిగి పీపీఎఫ్ ఖాతా పునరుద్ధరించుకోవచ్చు.