Fiscal Deficit | న్యూఢిల్లీ, జూలై 31: సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వేగంగా పెరిగే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే భారీగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఈ ఏప్రిల్-జూన్లోనే ఇది 25.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదేకాలంలో ఇది బడ్జెట్ లక్ష్యంలో 21.2 శాతమే ఉంది. ద్రవ్యలోటు జూన్ చివరినాటికి రూ.4,51,370 కోట్లకు చేరినట్టు సోమవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు..
వడ్డీలకే 2.43 లక్షల కోట్లు
ముగిసిన మూడు నెలల కాలంలో మొత్తం రూ.10.5 లక్షల కోట్ల వ్యయంలో రూ.7.72 లక్షల కోట్లు రెవిన్యూ వ్యయం కాగా, రూ.2.78 లక్షల కోట్లు మూలధన వ్యయంగా సీజీఏ వెల్లడించింది. మొత్తం రెవిన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకే కేంద్ర ప్రభుత్వం రూ. 2,43,705 కోట్లు ఖర్చుచేసింది. రూ.87,035 కోట్లు సబ్సిడీల కోసం వెచ్చించింది. ప్రభుత్వ వ్యయం, ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. ద్రవ్యలోటు పెరిగితే ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.