Nirmala on Crypto | క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేస్తున్నామా.. నిషేధిస్తున్నామా..?.. లేదా?.. అన్న అంశంతో సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై వచ్చే లాభాల మీద పన్ను విధించే హక్కు తమ ప్రభుత్వానికి ఉందని తేల్చేశారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్-2022పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆమె సమాధానం ఇచ్చారు.
క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించడం ప్రభుత్వ సావరిన్ రైట్ ( sovereign right ) అని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్లో క్రిప్టో లావాదేవీలపై నిషేధం విధించడంపై అన్ని వర్గాలతో, భాగస్వాములందరితో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించి సరైన చర్య తీసుకున్నారని పలువురు విపక్ష సభ్యులు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులతో భారీ మొత్తంలో లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చేయలేదన్నారు.
ఈ నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ నిర్మలా సీతారామన్.. క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో లాభాలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారం ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ముప్పని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు సొంత రిస్క్తో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టొచ్చునన్నారు.