Nirmala on Crypto | త్వరలో క్రిప్టో కరెన్సీ పేరేమిటో వెల్లడిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఖజానాకు ద్రవ్యలోటు ఎంత ఉన్నా ఈ ఏడాది వేటిపైనా పన్నులు పెంచలేదని చెప్పారు. కరోనా మహమ్మారి కష్ట కాలంలో పన్నులు విధించొద్దని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంగా చెప్పారని అన్నారు.
అందుకే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లను పన్నులు లేకుండా ప్రవేశ పెట్టామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందన్నారు. బడ్జెట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉత్పత్తి రంగంలో పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ఇక పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రెడిట్ గ్యారంటీ పథకం కోసం బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ప్రారంభిస్తామని అన్నారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎయిరిండియాను టాటా సన్స్ కొనుగోలు చేసిందని చెప్పారు. ఎన్ఐఎన్ఎల్ సంస్థ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.