ముంబై, సెప్టెంబర్ 10: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఆదాయం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. లాభాలు తగ్గుముఖం పడుతున్నా.. రెవిన్యూలో మాత్రం 15-18 శాతం పెరుగుదల ఉండొచ్చని పేర్కొన్నది. ఈ క్రమంలోనే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగం రెవిన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష కోట్ల రూపాయల మార్కును దాటవచ్చని అభిప్రాయపడింది.
కరోనాకు ముందు పరిశ్రమ ఆదాయంతో పోల్చితే ఇది 3 శాతం అధికం. కాగా, దేశంలోని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కొనుగోళ్ల శక్తి పెరిగిందని, ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో గ్రామీణ డిమాండ్ పరిశ్రమకు కీలకం కానుందని క్రిసిల్ తమ తాజా నివేదికలో చెప్పింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పంట దిగుబడులు పెరిగి, గ్రామీణ ఆదాయం కూడా పరుగులు పెట్టగలదన్న ఆశాభావాన్ని కనబర్చింది.
దేశీయ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాన్ని తయారీ ఖర్చులు వేధిస్తున్నాయి. కాపర్, అల్యూమినియం, ఉక్కు, పాలీప్రోపిలీన్ వంటి వాటి ధరలు పెరగడంతో ఉత్పాదక వ్యయం కూడా పెరిగిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి. అయితే మార్కెట్లో డిమాండ్ ఉందని, ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లకు ఆదరణ బాగుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఇండస్ట్రీ రెవిన్యూ పెరిగినా.. సంస్థలకు వచ్చే లాభాలు మాత్రం ఆకర్షణీయంగా ఉండబోవన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కూడా లాభాలకు కోత పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం ముడి సరుకుల్లో 45-50 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతున్నాయని అంటున్నారు. దీంతో రూపాయి విలువ పడిపోతున్నకొద్దీ దిగుమతి చేసుకునే ఉత్పత్తుల వ్యయం పెరిగిపోతున్నదని, ఆ మేరకు మార్కెట్లో వస్తు ధర పెరగకపోతే సంస్థ లాభాలపై ఆ ప్రభావం కనిపిస్తున్నదని ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ధరలు పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ధరలు పెరిగితేనే రెవిన్యూలో పెరుగుదల ఆనందం పరిశ్రమకు ఉంటుందని, లేకపోతే లాభాలు తగ్గి సమస్యలు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.