న్యూఢిల్లీ, మార్చి 15: తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, చాలావరకూ విదేశీ పరిణామాల కారణంగా దేశంలోకి దిగుమతైన ఈ ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి చెప్పారు. దిగుమతి సుంకాల తగ్గింపు ద్వారా ప్రభుత్వం దేశంలో ధరల్ని దించవచ్చని, పన్నుల్ని యథాతథంగా అట్టిపెట్టడం ద్వారా ద్రవ్యలోటును నిర్వహించవచ్చని ఆయన సూచించారు. ఒక ఆంగ్లచానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల్ని ఆయన పంచుకున్నారు. వివరాలు…
వడ్డీ రేట్లు 0.75 శాతం వరకూ పెరగొచ్చు
ఫిబ్రవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతానికి చేరినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. రిజర్వ్బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య అదుపు చేయాలంటూ ఆర్బీఐని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ శ్రేణి గరిష్ఠ బ్యాండ్ 6 శాతంపైనే వరుసగా రెండో నెల సైతం రిటైల్ ద్రవ్యోల్బణం నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్బ్యాంక్ 50-75 బేసిస్ పాయింట్ల మేర (0.5-0.75 శాతం) వడ్డీ రేట్లను పెంచవచ్చని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ అంచనా వేస్తున్నారు.
వ్యత్యాసం ఎందుకు?
టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని క్రిసిల్ ఆర్థికవేత్త వివరిస్తూ టోకు బాస్కెట్లో ప్రధానంగా క్రూడ్, ఇతర కమోడిటీలు ఉంటాయని, అవి ధరలు పెరిగినంతనే వాటి ఉప ఉత్పత్తులైన నాఫ్తా, పారిశ్రామిక ఇంధనం, విమానయాన ఇంధన ధరలు తక్షణమే వినియోగదారులకు బదిలీ అవడంతో టోకు ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పరోక్షంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున, అవి వెంటనే పెరగకపోవడంతో ఆ ఇంధనాలు ఉన్న రిటైల్ బాస్కెట్..టోకు కంటే తక్కువ పెరుగుతుందన్నారు. అలాగే ఆహారోత్పత్తులు టోకు బాస్కెట్లో తక్కువగా, రిటైల్ బాస్కెట్లో ఎక్కువగా ఉంటాయని, దాంతో ఆహార ద్రవ్యోల్బణం రిటైల్లో ప్రతిబింబిస్తుందని వివరించారు.
ఆహార ద్రవ్యోల్బణానికి వంటనూనెలే కారణం
ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వంటనూనెలేనని, గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాల ధరలు పెద్దగా పెరగలేదని ధర్మకీర్తి జోషి చెప్పారు. అలాగే దేశంలో తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, కొంతవరకూ మనం ఎగుమతులు కూడా చేయగలుగుతున్నామన్నారు. అయితే పప్పు దినుసులు, వంటనూనెల విషయానికొస్తే అవి విదేశాల్లో ట్రెండ్కు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయని, దేశంలో సైతం ఈ ఏడాది వాటి దిగుబడి లక్ష్యానికంటే తక్కువగా ఉన్నదన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే..
రిటైల్ ద్రవ్యోల్బణంపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల ప్రభావాన్ని క్రిసిల్ ఆర్థిక వేత్త ప్రస్తావిస్తూ 2022-23లో సగటు క్రూడ్ ధర 87 డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని, దీని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం మేర స్థిరపడవచ్చన్నారు.