న్యూఢిల్లీ, మే 24: ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు అన్ని ఆన్లైన్లో కొనుగోళ్ళు చేస్తున్నారు. ఒక్క బటన్తో తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఆన్లైన్లో ఉండటంతో ప్రజలు ఎగబడి కొనుగోళ్ళు జరుపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆన్లైన్ సేవలు అందిస్తున్న సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించడంతో ప్రజలు తమ వద్ద ఉన్న క్రెడిట్ కార్డుతోనే గరిష్ఠ స్థాయిలో కొనుగోళ్ళు జరుపుతున్నారు.
ఒక్క నెల మార్చిలోనే క్రెడిట్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల స్థాయిలో కొనుగోళ్ళు జరిపారు. ఈ వివరాలను రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. 7.3 కోట్ల క్రెడిట్ కార్డ్ కలిగిన వారు రూ.68,327 కోట్ల స్థాయిలో పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) వద్ద స్పైప్ చేసి కొనుగోళ్ళు చేశారని తెలిపింది. 11 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు జరుగగా, 11.1 కోట్ల ఆఫ్లైన్ లేదా పీవోఎస్ యంత్రాల ద్వారా జరిగినట్లు తెలిపింది. మొత్తంమీద మార్చి నెలలో లక్ష కోట్ల రూపాయలు ఆఫ్లైన్, ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.343.71 కోట్ల మేర నగదును ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమని పేర్కొంది.
క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. మార్చి నెలలో కొత్తగా 19 లక్షల క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీచేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఒక నెలలో ఇంతటి స్థాయిలో జారీచేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత్లో 7.36 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. జారీ చేసిన సంస్థల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా 1.67 కోట్ల క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందచేసింది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.37 కోట్ల క్రెడిట్ కార్డులను ఇవ్వగా, ఐసీఐసీఐ బ్యాంక్ 1.29 కోట్లు ఇచ్చింది.