Credit Card | గతంతో పోలిస్తే దేశంలో రోజువారీ అవసరాల కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్న వారు గణనీయస్థాయిలోనే ఉన్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికి ప్రస్తుతం పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, పలుసార్లు క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుంది. గడువు లోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించని కస్టమర్లపై సంబంధిత బ్యాంకులు.. క్రెడిట్ కార్డు సంస్థలు భారీ పెనాల్టీ విధిస్తాయి. అంతే కాదు వారి సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ, గడువు తేదీ లోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే, ఎటువంటి పెనాల్టీ పే చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సార్లు క్రెడిట్ కార్డు యూజర్లు సకాలంలో బిల్లుచెల్లించడం మరిచిపోతారు. ఇటువంటి తరుణంలో క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందని భయపడుతుంటారు. కానీ వారు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటీవలే క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు నిబంధనలను ఆర్బీఐ సవరించింది. ఆ నిబంధనలేమిటో చూద్దామా..
క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు విషయమై ఆర్బీఐ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. డ్యూ డేట్ (బిల్లు చెల్లింపు తేదీ) లోపు చెల్లించకపోయినా పెనాల్టీ విధించరాదని ఆర్బీఐ నిర్ణయించింది. డ్యూడేట్ తర్వాత మూడు రోజుల వరకు క్రెడిట్ కార్డు యూజర్లకు వెసులుబాటు కల్పించింది. ఆ మూడు రోజుల్లోపు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోయినా పెనాల్టీ విధించరు. ఈ మూడు రోజుల గడువు లోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే పెనాల్టీ విధించడం గానీ, సిబిల్ స్కోర్ తగ్గిపోవడం గానీ జరుగదు. కానీ, మూడు రోజులు దాటిన తర్వాత పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది.
డ్యూడేట్, మూడు రోజుల గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించని ఎడల సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థ మీపై పెనాల్టీ విధిస్తుంది. ఆ పెనాల్టీ మీ బిల్లును బట్టి ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు బిల్లు చాలా ఎక్కువగా ఉంటే, పెనాల్టీ కూడా ఎక్కువ చార్జీ చేస్తుంది. ఉదాహరణకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లులు రూ.500-1000 మధ్య ఉంటే రూ.400 పెనాల్టీ, రూ.1000-10,000 మధ్య ఉంటే రూ.750, రూ.10,000-25,000 మధ్య ఉంటే రూ.950 పెనాల్టీ విధిస్తుంది.