న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ పుస్తకాలు తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది. కంపెనీల చట్టాన్ని అమలు చేసే ఈ శాఖ తన ప్రాంతీయ కార్యాలయం నుంచి నివేదిక అందిన అనంతరం బైజూస్పై తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు.
బైజూస్ బ్రాండ్నేమ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు రిజిష్టర్డ్)పై దర్యాప్తు జరపాలంటూ 2023 జూలైలోనే మంత్రిత్వ శాఖ హైదరాబాద్లోని రీజనల్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆదేశించింది.అప్పట్లో కంపెనీ ఆడిటర్ రాజీనామా చేయడం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమర్పించకపోవడం తదితర పరిణామాలపై దర్యాప్తును ఆదేశించగా, తాజాగా కంపెనీ పుస్తకాల్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్టు అధికారి వెల్లడించారు.
కంపెనీపై ప్రస్తుతం కొనసాగుతున్న తనిఖీలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమచారాన్ని, డాక్యుమెంట్లను రీజనల్ డైరెక్టర్ కోరుతున్నారని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వివిధ డాక్యుమెంట్లతో సహా అవసరమైన సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు బైజూస్ ప్రతినిధి చెప్పారు. అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటుతో సహా కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ అమలుకు తీసుకున్న చర్యల్ని తెలియచేశామని ఆ ప్రతినిధి వివరించారు.
మరోవైపు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా బైజూస్ కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో సమర్పించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను పరిశీలిస్తున్నది. బైజూస్ కేసు ప్రాసెస్లో ఉన్నదని ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్మెంట్ను పూర్తిచేశామని, రిజిష్ర్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి ఫైల్ చేశామని బైజూస్ ప్రతినిధి వెల్లడించారు.
వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఇటీవల జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో ఆ సంస్థలో 32 శాతం వాటా ఉన్న షేర్హోల్డర్లు ఓటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రవీంద్రన్, ఆయన సతీమణి, సోదరుడు ఈజీఎంకు హాజరుకానందున తీర్మానం చెల్లదంటూ బైజూస్ వాదించిన విషయం విదితమే. మరోవైపు ఈజీఎం తీర్మానాన్ని తమ తదుపరి విచారణ మార్చి 13 వరకూ ఆమోదించరాదని కర్నాటక హైకోర్టు ఆదేశించింది.