బోస్టన్ (యూఎస్), అక్టోబర్ 5: కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ భారీ నష్టాల్ని చవిచూస్తున్నది. 2020-2022 మధ్యకాలంలో పరిశ్రమకు 201 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కోట్లు) నష్టం వస్తుందని అంతర్జాతీయ విమానయాన సంస్థల అసోసియేషన్ ఐఏటీఏ అంచనావేసింది. అయితే కొన్ని సమస్యలున్నప్పటికీ, సంక్షోభ తీవ్రత నుంచి బయటపడుతున్నామని, కోలుకునేదిశగా పయనిస్తున్నామని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. అమెరికాలోని బోస్టన్లో జరిగిన ఐఏటీఏ 77వ వార్షిక సదస్సులో వాల్స్ మాట్లాడుతూ 2020లో 138 బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని, 2021లో ఇది 52 బిలియన్ డాలర్లకు తగ్గుతుందన్నారు. 2022లో నష్టాలు మరింతగా 12 బిలియన్ డాలర్లకు తగ్గనున్నట్లు అంచనావేస్తున్నామని, మొత్తంమీద కొవిడ్తో నష్టాలు 201 బిలియన్ డాలర్లు ఉండవచ్చన్నారు. 2023లో పరిశ్రమ లాభాల బాట పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
ఈ ఏడాది ఆదాయం 472 బిలియన్ డాలర్లు&
అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 472 డాలర్లకు చేరవచ్చని, గతేడాదితో పోల్చితే 26.7 శాతం పెరుగుతుందని ఐఏటీఏ వర్గాలు తెలిపాయి. 2022లో ఆదాయం 39.3 శాతం వృద్ధితో 658 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఆ వర్గాలు అంచనాగా చెప్పాయి.