కొత్త ఇన్కం టాక్స్ పోర్టల్ వెబ్సైట్లో ఇక నుంచి కొన్ని పేమెంట్ మార్గాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లిస్తే, పన్ను చెల్లింపుదార్లకు కన్వీనియన్స్ చార్జీలు, జీఎస్టీలు అదనపు భారం కానున్నాయి. ఈ-ఫైలింగ్ ఐటీ పోర్టల్లో ప్రభుత్వం తాజాగా క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించే ఆప్షన్ను ఎనేబుల్ చేసింది. అయితే ఐటీ చెల్లింపులకు ‘పేమెంట్ గేట్వే’ పద్దతిని పన్ను చెల్లింపుదారు ఎంచుకుంటే, అందులోగల పేమెంట్ మార్గానికి కొన్ని చార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు మీరు రూ. 30,000 ఆదాయపు పన్ను చెల్లిస్తే అందుకు దాదాపు రూ.300 అదనంగా కట్టాలి. పన్ను చెల్లింపునకు పోర్టల్లో ఐదు పేమెంట్ ఆప్షన్స్ (నెట్బ్యాంకింగ్, డెబిట్కార్డ్, పేఎట్బ్యాంక్ కౌంటర్, ఆర్టీజీఎస్/నెఫ్ట్, పేమెంట్ గేట్వే) ఉంటాయి. ఇందులో పేమెంట్ గేట్వేను ఉపయోగించుకుని, కొన్ని మార్గాల్లో చెల్లిస్తే లావాదేవీ చార్జీలు వర్తిస్తాయి. ఈ పేమెంట్ గేట్వేను క్లిక్చేస్తే వివిధ పేమెంట్ గేట్వేల మోడ్స్, వాటికి లావాదేవీ చార్జీల వివరాలుంటాయి.
ఉదాహరణకు క్రెడిట్ కార్డుతో రూ. 30,000 అదాయపు పన్నును చెల్లిస్తే 0.85 శాతం కన్వీనియన్స్ ఫీజు పడుతుంది.
అది రూ.255 అవుతుంది. ఈ ఫీజుపై 18 శాతం జీఎస్టీ రూ.45.9. అంటే క్రెడిట్ కార్డుతో ఈ చెల్లింపు చేస్తే రూ.301 అదనంగా కట్టాలి. పన్ను పెరిగిన కొద్దీ ఈ చార్జీలు సైతం పెరుగుతాయి. పేమెంట్ గేట్వే మెథడ్ను ఉపయోగించుకుని, నెట్బ్యాంకింగ్ ఆప్షన్లో పన్ను చెల్లిస్తే జీఎస్టీతో పాటు చార్జీలు ఫ్లాట్గా (శాతంలో కాకుండా) ఉంటాయి. కొత్త ఐటీ పోర్టల్లో పేమెంట్ గేట్వే మెథడ్ను ఉపయోగించుకుంటానే లావాదేవీ చార్జీలు వర్తిస్తాయని టాక్స్2విన్.ఇన్ సీఈవో అభిషేక్ సోని తెలిపారు. అయితే ఈ పేమెంట్ గేట్వే మెథడ్ ఐటీ శాఖ ఆథరైజ్ చేయని బ్యాంక్ల నెట్బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐలకే వరిస్తుంది. కానీ ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లిస్తే ఎటువంటి లావాదేవీ చార్జీలు ఉండవు. ఎన్ఎస్డీఎల్ సైట్లో చార్జీలు లేకుండా నెట్బ్యాంకింగ్ ఆప్షన్ను ఉపయోగించుకుని పన్ను చెల్లించొచ్చు. అలాగే ఐటీ శాఖ ఆథరైజ్డ్ బ్యాంక్ల నెట్బ్యాంకింగ్తో చార్జీలు ఉండవు. ఇప్పటివరకూ మూడు బ్యాంక్లు-కొటక్ మహింద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లనే శాఖ ఆథరైజ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఫెడరల్ బ్యాంక్ నెట్బ్యాంకింగ్పై చార్జీని చెల్లించాల్సివస్తుంది.
ఇతర చెల్లింపు మార్గాలు
నెట్ బ్యాంకింగే కాకుండా నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఓవర్ ద కౌంటర్ (బ్యాంక్ శాఖల్లో నేరుగా చెల్లింపు) ఆప్షన్లను కూడా ఐటీ పోర్టల్ అనుమతిస్తున్నది. ఈ పోర్టల్లో డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుల్ని ఇంకా ఎనేబుల్ చేయలేదు. బ్యాంక్ కౌంటర్లలో చెక్కుల ద్వారా ఐటీ చెల్లింపులు చేస్తే చార్జీలు ఉండవు. ఆయా బ్యాంక్లకు అనుగుణమైన నెఫ్ట్/ఆర్టీజీఎస్ చార్జీలు ఉంటాయి.