Continental India | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్న వేళ.. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మొదలు ప్రతీ రంగంలోని కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కానీ, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న జర్మనీ టెక్నాలజీ జెయింట్ కాంటినెంటల్ టీసీఐ (Continental’s TCI) గ్లోబల్ ఆర్ ఆండ్ డీ కేంద్రంలో 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకుంటామని తెలిపింది.
అటానమస్ మొబిలిటీ, ఆర్కిటెక్చర్, నెట్ వర్కింగ్, సేఫ్టీ అండ్ మోషన్, స్మార్ట్ మొబిలిటీ, యూజర్ ఎక్స్ పీరియన్స్ తదితర నూతన వాణిజ్య రంగాల్లో మద్దతు కోసం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను నియమించుకోవాలని తలపోస్తున్నది. ఎంబీడెడ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ రంగాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకుంటామని కాంటినెంటల్ ఇండియా ప్రెసిడెంట్ కం సీఈఓ ప్రశాంత్ దొరైస్వామి తెలిపారు.
బెంగళూరులో 2009లో కాంటినెంటల్ సంస్థ బెంగళూరులో టీసీఐ అనే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కీలక ఆర్ అండ్ డీ సెంటర్ (టీసీఐ) ఏర్పాటు చేసింది. స్థానిక, గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రం పని చేస్తుంది. ఇటీవలే అటానమస్ మొబిలిటీ, ఆర్కిటెక్చర్ అండ్ నెట్వర్కింగ్, సేఫ్టీ అండ్ మోషన్, స్మార్ట్ మొబిలిటీ, యూజర్ ఎక్స్పీరియన్ వంటి ఆటోమోటివ్ బిజినెస్ రంగాల్లోకి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కాంటినెంటల్లో 43 వేల మంది ఆర్ అండ్ డీ ఇంజినీర్లు పని చేస్తుండగా, వారిలో సుమారు ఆరు వేల మంది భారత్ లోనే సేవలందిస్తున్నారని దొరైస్వామి తెలిపారు.