Consumer Goods Price | బాస్మతి రైస్ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, దుస్తులు మొదలు వ్యవసాయ ఉత్పత్తులు, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరగబోతున్నాయి. టెలివిజన్, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు వచ్చే నెలలో 5-6 శాతం పెరగనున్నాయి. తిరిగి కొత్త సంవత్సరం 2022 జనవరి-ఫిబ్రవరి మధ్య 10-12 శాతం పెరుగనున్నాయి.
ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి కరోనా వేళ కంటైనర్ల లభ్యత ఇబ్బందులు ఉన్నా.. ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. కానీ అత్యధిక ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో వచ్చే రెండు, మూడు నెలల్లో గృహ వినియోగ వస్తువుల ధరలు పెరగబోతున్నాయని ఆయా పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. అయితే అపారెల్ వస్తువుల ఎగుమతిదారులు బిగ్ బ్రాండ్స్పై హయ్యర్ కాస్ట్ తగ్గించడానికి చర్చలు జరుపుతున్నాయి.
కానీ ప్రతికూల వాతావరణం వల్ల పంటలు దెబ్బతిని భారత్లో దిగుబడి తగ్గుతుందన్న అంచనాల మధ్య బాస్మతి రైస్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం ఇప్పటికే పెరిగిపోయాయి. కంటైనర్ల లభ్యత మెరుగు పడటంతో ఆయా దేశాల నుంచి భారత్కు దూరాన్ని బట్టి రవాణా ఖర్చులు 10-12 వేల డాలర్ల నుంచి 5-15 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే 3000-4000 డాలర్లు ఎక్కువేనని భావిస్తున్నారు.
నూలు ధరలు గతేడాదితో పోలిస్తే 60 శాతానికి పైగా పెరిగాయి. ఈ భారం వినియోగదారులపై మోపితే స్వీకరిస్తారా.. లేదా? అన్న అనుమానం తమను వెంటాడుతున్నదని నొయిడా అపారెల్ ఎక్స్పోర్ట్ క్లస్టర్ ప్రెసిడెంట్ లలిత్ థుక్రాల్ చెప్పారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో వివిధ దేశాల్లోని బిగ్ బ్రాండ్స్ అపారెల్ విక్రేతలు రవాణా చార్జీల తగ్గింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీలు చైనా, హాంకాంగ్ నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుంటాయి. ఆగస్టుతో పోలిస్తే వీటి రవాణా ధరలు 10-15 శాతం తగ్గాయి. నెల రోజుల క్రితం చైనా నుంచి రవాణా చార్జీలు 7000 డాలర్లు ఉంటే ఇప్పుడు 6000-6500 డాలర్లకు తగ్గుముఖం పట్టాయి.
హాంకాంగ్ నుంచి విమాన రవాణా చార్జీలు కిలోపై 44-45 డాలర్ల నుంచి 36-37 డాలర్లకు తగ్గింది. కానీ జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ధరలు ఎక్కువ. జూన్ త్రైమాసికంలో కంటైనర్ రవాణ చార్జీ 3500 డాలర్లు మాత్రమే ఉంది.