న్యూఢిల్లీ, జనవరి 8: తమను కూడా ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించి బూస్టర్ డోస్ ఇవ్వాలని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తమకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఏఐబీవోసీ) పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ పనిదినాలను వారానికి ఐదు రోజులు కుదించాలని కేంద్రానికి ఏఐబీవోసీ సూచించింది. బ్యాంక్ల శాఖల్లో సగం మంది ఉద్యోగులతో బ్యాంకింగ్ సేవలు అందించాలని, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే విధంగా అవకాశం కల్పించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సబర్బన్ రైల్వేలో ప్రత్యేక సర్వీసుల విభాగం కింద సేవలు అందించే విధంగా చొరవ చూపాలని వారు కోరుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 2 వేల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఏఐబీవోసీ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తంచేశారు.