Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కార్ల ఉత్పత్తి తగ్గే చాన్స్ ఉందని మారుతి సుజుకీ (Maruti Suzuki) పేర్కొన్నది. ఎలక్ట్రానిక్ విడిభాగాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది.. ఆయా విడి భాగాల ఉత్పత్తి తగ్గడం వల్ల కార్ల తయారీ తగ్గిపోవచ్చునని అభిప్రాయ పడింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు సెమీకండక్టర్లు, చిప్ల కొరతతో మారుతి సుజుకి కార్ల తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా ఎలక్ట్రానిక్ విడి భాగాల కొరత ముంచుకొచ్చింది.
గతేడాది (2022-23)లో కూడా ఎలక్ట్రానిక్ విడి భాగాల కొరత వల్లే కార్ల తయారీ ఉత్పత్తి తగ్గిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. గతేడాది రమారమీ 20 లక్షల యూనిట్ల వాహనాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మారుతి సుజుకి.. 19.22 లక్షల యూనిట్లతోనే సరిపెట్టుకున్నది.
ప్యాసింజర్ వెహికల్స్ తోపాటు లైట్ కమర్షియల్ వెహికల్స్ ప్రొడక్షన్ భారీగా తగ్గింది. గతేడాది అంటే 2021-22లో 1,63,392 యూనిట్లు ఉత్పత్తి నమోదైతే.. 2022-23లో ఆరు శాతం తగ్గి 1,54,148 యూనిట్ల వెహికల్స్కు చేరింది. 2021-22లో 1,59,211 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి గత నెలాఖరు నాటికి 1,50,820 యూనిట్లకు పడిపోయింది.
మారుతి సుజుకిలో మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్లో కార్ల ప్రొడక్షన్ 1,08,001 యూనిట్లకే సరి పెట్టుకున్నది. 2022 మార్చి నెలాఖరు నాటికి 36,249 యుటిలిటీ వాహనాలు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది మార్చి నాటికి వాటి ఉత్పత్తి భారీగా తగ్గి 29,440 యూనిట్లతో సరిపెట్టుకున్నది. వాణిజ్య వాహనాల ప్రొడక్షన్ కూడా 4,181 యూనిట్ల నుంచి 3,328 యూనిట్లకు పడిపోయింది.
వచ్చే కొన్ని త్రైమాసికాల్లో కూడా సెమీ కండక్టర్ల కొరత కొనసాగుతుందని గత నెలలో మారుతి సుజుకి అంచనా వేసింది. దీనివల్ల కార్లు, యుటిలిటీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ పెండింగ్ ఆర్డర్లు మరింత పెరుగుతాయని వెల్లడించింది. మరికొన్ని నెలల పాటు ఈ పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వేళ 2021లో చిప్ల కొరత వల్ల మారుతి సుజుకి ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఫలితంగా ప్యాసింజర్ వెహికల్స్ ప్రొడక్షన్ భారీగా క్షీణించింది.