హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గ్యాస్ టర్బయిన్ టెక్నాలజీలో వివిధ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర పరిష్కారాలను అందించడంలో బీహెచ్ఈఎల్-జీఈ గ్యాస్ టర్బయిన్ సర్వీసెస్ (బీజీజీటీఎస్) ప్రైవేటు లిమిటెడ్ 25 ఏండ్లు పూర్తిచేసుకున్నది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్), జనరల్ ఎలక్ట్రిక్ 50:50 శాతం జాయింట్ వెంచర్ కంపెనీ ఇది. ‘దేశంలో.. దేశం కోసం’ అనే విధానానికి అనుగుణంగా బీజీజీటీఎస్ భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్లతో సహా దక్షిణాసియాలో పవర్ ప్లాంట్ ఆపరేటర్లకు అధునాతన ఇంజినీరింగ్, మరమ్మతు సేవలను అందిస్తున్నది. హైదరాబాద్లో 1997లో ఏర్పడిన ఈ సంస్థ అధునాతన గ్యాస్ టర్బయిన్ టెక్నాలజీని స్థానిక ఇంజినీరింగ్ సామర్థ్యాలతో మేళవిస్తున్నది. 25 ఏండ్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా బీజీజీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ సంక్రాని మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో డికార్బనైజేషన్ సాంకేతికతను అనుసరించే విషయంలో భారత్కు అంతర్జాతీయంగా మంచి పేరుందని చెప్పారు. భారత ఎనర్జీ రంగంలో గ్యాస్ ఆధారిత శక్తిని మరింత అధికం చేసే తమ కృషి కొనసాగుతుందని అన్నారు.