ముంబై, సెప్టెంబర్ 22: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ దూకుడుతో భారత కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచడంతోపాటు మున్ముందు మరింత పెంపులుంటాయన్న సంకేతాలతో డాలర్ విలువ బలపడటంతో ఇతర దేశాల కరెన్సీలతో పాటు రూపాయి సైతం నిలువునా పతనమయ్యింది. గురువారం నాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ ఏకంగా 83 పైసలు క్షీణించింది. దీంతో రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయి 80.79 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తర్వాత ఒకేరోజు ఇంతగా తగ్గడం ఇదే ప్రథమం. ఫెడ్ పెంపు, ఉక్రెయిన్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతనానికి దారితీసినట్టు ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. ఇంట్రాడేలో ఈ విలువ 80.95 స్థాయికి పతనమయ్యింది. బుధవారం రాత్రి ఫెడ్ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచి 3-3.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఏకైక లక్ష్యంతో ఫెడ్ రేట్లు పెంచడం ఇది వరుసగా మూడోసారి. ఈ ఏడాది చివరికల్లా రేట్లను 4.50 శాతానికి తీసుకెళతామన్న సంకేతాల్ని సైతం ఇచ్చింది. దీని ప్రకారం వచ్చే నవంబర్, డిసెంబర్ సమీక్షల్లో 1.25 శాతం మేర వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ సంకేతాల నేపథ్యంలో ఒక్కసారిగా డాలర్ ఇండెక్స్ 20 ఏండ్ల గరిష్ఠం 111.80ని చేరడంతో రూపాయితో సహా పలు దేశాల కరెన్సీలు విలవిలలాడాయి.
మరింత క్షీణత
రూపాయి మరింత తగ్గే అవకాశం ఉందని, డాలర్ పటిష్ఠతకు దేశీ కరెన్సీ తలొగ్గుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. అయితే ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే తగ్గుదల తక్కువగా ఉంటుందన్నారు. రూపాయి డౌన్ట్రెండ్కు వచ్చే కొద్ది రోజుల్లో 81.25, 81.40 స్థాయిల వద్ద అవరోధం కలగవచ్చని, 80.12 స్థాయి మద్దతునివ్వవచ్చని పర్మార్ అంచనావేశారు. ఫెడ్ కామెంటరీ కఠినంగా ఉన్నందున రూపాయి క్షీణత తప్పని పరిణామమని ఫినెక్స్ ట్రెజరీ అడ్వయిజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్ భన్సాలీ చెప్పారు.
కుటుంబాలపై ధరల భారం
రూపాయి నిలువునా పతనమైన ప్రభావం కుటుంబాలపై నేరుగానే పడుతుంది. దిగుమతులు ఖరీదు కానున్నందున, దేశంలోకి వచ్చే ప్రతీ ఉత్పత్తీ ప్రియమైపోతాయి. అటు టోకు ద్రవ్యోల్బణం, ఇటు వినిమయ ధరల సూచి ఎగిసిపోతాయి. నిత్యావసరాలైన వంటనూనెలు, పప్పు దినుసులు నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, సెల్ఫోన్లు, కార్లు తదితరాల ధరలన్నింటిపై రూపాయి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయంగా పుత్తడి, క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాసరే..అవి రూపాయి మారకంలో ఖరీదవుతాయి. ఎరువులు, లోహాలు, ఇతర కమోడిటీలు ధరలు దేశంలో ఎగిసిపోతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా వ్యయాలు పెరుగుతాయి. తద్వారా ప్రతీ ఉత్పత్తి ధరపై ఆ మేరకు ప్రభావం పడుతుంది. బాత్ సోప్స్, బిస్కెట్ల దగ్గర్నుంచి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్లో చాలావరకూ పెరుగుతాయి. మన జీడీపీలో దిగుమతయ్యే ఉత్పత్తుల విలువ (20 శాతం) పెరుగుతున్నందున, ప్రతీ కుటుంబపు నెలవారీ బడ్జెట్లు అధికమవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్బ్యాంక్ డాటా ప్రకారం రూపాయి 5 శాతం క్షీణిస్తే ద్రవ్యోల్బణం 0.15 శాతం మేర పెరుగుతుంది.