యాదాద్రి భువనగిరి, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగే వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9:30 గంటలకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో కలిసి ఒకేసారి 51 పరిశ్రమలకు శ్రీకారం చుట్టనున్నారు. పరిశ్రమలతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, సెవజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యాలయం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టిఫ్)ను ప్రారంభించనున్నారు. అదే విధంగా టాయ్స్ పార్కుకు భూమి పూజ కూడా చేయనున్నారు. రూ. 156 కోట్లతో 106 ఎకరాల స్థలంలో ఈ పార్క్ను నెలకొల్పుతున్నది.
41 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్..
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ అందుబాటులోకి రానున్నది. 5 ఎకరాల స్థలంలో సుమారు రూ.41 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ కేంద్రాన్ని జనవరి 2021లో శంకుస్థాపన చేశారు. రెండు బ్లాక్లుగా నిర్మించిన ఈ సెంటర్ మొదటి బ్లాక్లో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఆడిటోరియం, ఐలా, టిఫ్ కార్యాలయాలు, రెస్టారెంట్లు, బ్యాంక్ల కోసం నిర్మించారు. పార్కులో ఉత్పత్తి చేసిన పరిశ్రమల వస్తువులను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా రెండో బ్లాక్ను నిర్మించనున్నారు.