భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో ఏడాది క్రితం ఉదయం టిఫిన్లో చట్నీ, సాంబారు, మధాహ్నం భోజనంలో ఏదైనా కూర, ఫ్రై, చారు, పచ్చడి. సాయంత్రం స్నాక్స్, రాత్రి చపాతీలు, భోజనం ఉండేవి. ఇప్పుడు ఈ మెనూ మారింది. ఒక్కటే కూర, పచ్చళ్లు లేదంటే పెరుగు అంతే. కారణం అధిక ధరలు. నూనె లీటరు రూ.80 నుంచి 200 కాగా, వంట గ్యాస్ సిలిండర్ రూ.700 నుంచి 1,050కి చేరింది. పప్పు, ఉప్పు, బియ్యం, మాంసం, పాలు, చేపలు, పండ్లు, గుడ్లు వంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. వేతనం మాత్రం అక్కడే నిలిచింది. దీంతో తిండిలో కోత పడుతున్నది.
మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులపై పెను భారమే పడుతున్నది. గడిచిన ఇరవై ఏండ్ల నుంచి గమనిస్తే ప్రస్తుతం ప్రతీదాని రేటు పైపైకే పోయింది. ద్రవ్యోల్బణం ప్రమాద ఘంటికలు ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటగదినీ తాకింది. ద్రవ్యోల్బణం ప్రభావం కుటుంబ ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తున్నది మరి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ప్రకారం గడిచిన పదేండ్లలో ప్లేటు భోజనం ఖరీదు రెట్టింపైంది. గత 20 ఏండ్లలో ఇది రూ.23 నుంచి రూ.78కి ఎగిసింది. ఇక ఆహార పదార్థాలే కాకుండా, చమురు ధరల పెరుగుదల కారణంగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ట స్థాయికి చేరింది. ధరల పెరుగుదలతో సామాన్యుడు నరకం చూస్తున్నా .. కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
కిరాణా భారం
గడిచిన పదేండ్లలో కిరాణా సరుకుల వారాంతం వ్యయం 68 శాతం పెరిగింది. ముగ్గురు సభ్యుల కుటుంబానికయ్యే నెలవారీ కిరాణ ఖర్చు 2012తో పోల్చుకుంటే ఇప్పుడు రెట్టింపైందని డబ్ల్యూపీఐ విశ్లేషించింది. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు మార్చితో పోల్చితే ఈ మార్చిలో ఆహార పదార్థాల ధరలు 7.68 శాతం అధికమయ్యాయి. నవంబర్ 2020 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. జనవరి 2014, మార్చి 2022 మధ్య ప్రతి నెలా సగటున ఆహార పదార్థాల ధరల్లో 4.483 శాతం వృద్ధి నమోదైంది. ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే. అయితే ఈ ధరల పెరుగుదలలు.. యుద్ధం కారణంగా ఆకస్మికంగా జరిగినవి కాదని, ధరల పెరుగుదల సూచిక స్పష్టం చేస్తున్నది. నిజానికి యుద్ధానికి ముందు నుంచే దేశంలో ద్రవ్యోల్బణం ఛాయలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే దేశంలో ద్రవ్యోల్బణం 6 శాతంపైగా ఉండటం గమనార్హం.
పెరగని ఆదాయం..
ఓవైపు ధరలు ఆకాశాన్నంటుతున్నా.. సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. పైపెచ్చు కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నాచితకా వ్యాపారాలు మూతబడ్డాయి. తెలంగాణ మినహా ఇతర రాష్ర్టాల్లో కరెంటు కోతల కారణంగా కంపెనీల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గడిచిన పదేండ్లలో పెట్రో ధరలు రెట్టింపు కావడంతోపాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీసింది. దీంతో సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఆత్మహత్యల భారత్గా మారే అవకాశాలు ఏర్పడినట్టు మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి.
ద్రవ్యోల్బణానికి కొలమానం….
ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరల పెరుగుదల రేటు. భారతదేశంలో ఇది సంవత్సరానికి కొలుస్తారు. అంటే, ఒక నెల ధరలను మునుపటి సంవత్సరం అదే నెల ధరలతో పోల్చుతారు. ఈ రేటు నుంచి మనం ఆ సమయంలో ఒక ప్రదేశంలో జీవనవ్యయం పెరుగుదలను అంచనా వేయవచ్చు. టోకు ధరల సూచిన(డబ్ల్యూపీఐ) అనేది మార్కెట్లో వస్తువుల సగటు ధరలలో మార్పును కొలుస్తుంది. హోల్సేల్ మార్కెట్ అంటే పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలుచేయడం, ఇది వ్యాపారులు, చిల్లర వ్యాపారులు లేక కంపెనీలు చేస్తాయి. ఈ సూచిక యొక్క ఉద్దేశ్యం మార్కెట్లో ఉత్పత్తుల కదలికను ట్రాక్ చేయడం, తద్వారా డిమాండ్ మరియు సరఫరా పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి డబ్ల్యూపీఐని తమ ప్రాతిపదికగా పరిగణిస్తాయి. అయితే, భారతదేశంలో ఇది లేదు. మన దేశంలో డబ్ల్యూపీఐతో పాటు వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ)ని కూడా ద్రవ్యోల్బణానికి కొలమానంగా పరిగణిస్తారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధాన పరిమితిగా పరిగణిస్తుంది. డబ్ల్యూపీఐ, సీపీఐ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. ఈ విధంగా డబ్ల్యూపీఐతోపాటు సీపీఐ కూడా పెరుగుతుంది.
కేంద్రంలో గాడితప్పిన పాలన
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ప్రజలపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడిన చందంగా వ్యవహరిస్తూ కుల, మత రాజకీయాలతో కాలయాపన చేస్తుండడంపై ప్రజలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ సర్కారు అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. అయినప్పటికీ ధరల పోటును ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సామాన్యుడి ఆగ్రహం నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి.