హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియాను స్టాన్ఫోర్డ్.. ఆక్స్పోర్డ్ వర్సిటీల స్థాయిలో డెవలప్ చేస్తాం.. అన్ని వర్సిటీలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ఏ వర్సిటీలో ఎన్ని పోస్టులు భర్తీచేయాలన్న అంశంపై స్పష్టత ఇవ్వడంలేదు. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపడంలేదు. వర్సిటీ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖలో మూలుగుతున్నది. సర్కార్ జీవో ఇస్తుందని.. రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభిద్దామని వీసీలు కండ్లు కాసేలా ఎదురుచూస్తున్నారు. నెలలు గడిచినా ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
వర్సిటీల్లో 2,125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్స్ పెరుగుతుండటంతో సర్కార్ ఆచార్యుల ఉద్యోగ విరమణ వయస్సును 60-65 ఏండ్లకు పెంచింది. నియామకాలు చేపట్టాల్సిన సర్కార్ ఉన్నవాళ్లను కొనసాగించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీల్లో 420కి పైగా పోస్టుల భర్తీ కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించింది. భారీగా ఖాళీలున్నా.. పలు విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేకుండా నడిపిస్తున్నారు. వర్సిటీల్లో పరిస్థితు లు దిగజారుతుండటంతో గవర్నర్ శివప్రతా ప్ శుక్లా జోక్యం చేసుకున్నారు. ఇటీవలే ఉ న్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని లోక్భవన్కు పిలిపించుకుని ఆరా తీశారు. నివేదిక సమర్పించాలని ఆదేశించా రు. త్వరలోనే వర్సిటీలవారీగా వీసీలను పిలిచి సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 11 వర్సిటీల్లో 74 % టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,878 పోస్టులుంటే ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు.