Cool Drinks | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ.. ఐస్క్రీమ్, శీతల పానీయాల సంస్థల్లో గిరాకీ అంచనాలు బలపడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, డెయిరీ ఉత్పత్తుల సంస్థలు ఈసారి ఎండాకాలంలో తమకు గిరాకీ బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కోలా ఆధారిత ఫిజ్ డ్రింకులు, జ్యూస్లు, మినరల్ వాటర్, ఐస్క్రీములు, పాల ఉత్పత్తులు ఈ సమ్మర్లో అధికంగా అమ్ముడుపోగలవని అంటున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో కస్టమర్ల డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచి.. వ్యాపారులు, దుకాణదారుల వద్ద నిల్వలను పెంపొందించే పనిలో కంపెనీలు పడ్డాయి. ఈ ఏప్రిల్-జూన్ మధ్య ఎండల తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. దీంతో సేల్స్పై ఈసారి భారీ అంచనాలనే కంపెనీలు పెట్టుకున్నాయి.
కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్తకొత్త ఉత్పత్తులనూ మార్కెట్కు పరిచయం చేసే దిశగా ఆయా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారంపైనా దృష్టి పెడుతున్నాయి. ఇందులోభాగంగానే పత్రికలు, టెలివిజన్లు, యూట్యూబ్తోపాటు ఆన్లైన్ ఎడిషన్లు, సోషల్ మీడియాల్లో కూడా ప్రచారానికి తెర లేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థ పెప్సీ.. రణ్బీర్ కపూర్, రష్మికా మందన్న, హృతిక్ రోషన్, మహేశ్ బాబు, కియారా అదానీ, నయనతారలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. పెప్సీ, 7అప్, మిరిండా, మౌంటెయిన్ డ్యూ, ైస్లెస్, ట్రాపికానా తదితర ఉత్పత్తులను పెప్సీ అమ్ముతున్న విషయం తెలిసిందే. అలాగే కోకాకోలా, డాబర్, హాప్ తదితర ఇతర సంస్థలూ జోరును పెంచాయి. థమ్సప్, మాజా, స్ర్పైట్, ఫాంటా, కిన్లే సోడా వంటి కూల్డ్రింక్స్ను కోకాకోలా విక్రయిస్తున్నది. నిజానికి ఏడాదిలో సమ్మర్ మినహా మిగతా రోజుల్లో కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్ల ఉత్పత్తి, ప్రచారం, అమ్మకాలు తక్కువగానే ఉంటాయి. అయితే ఫిబ్రవరి మొదలు జూన్దాకా వీటి సందడి ఉంటుంది.