CNG Cars | మొన్నమొన్నటి వరకు లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్తో పోలిస్తే సీఎన్జీ గ్యాస్ ధర కాస్త సానుకూలంగా ఉంది. పెట్రోల్ లేదా డీజిల్ ఆధారంగా నడిచే కార్లతో పోలిస్తే సీఎన్జీ వేరియంట్ కార్లు పర్యావరణానికి అనుకూలం. పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్ల కంటే సీఎన్జీ కార్ల ధరలు పలుసార్లు పెరిగినా 2022-23లో వాటి సేల్స్ భారీగా పెరిగాయి. నాలుగు సబ్-సెగ్మెంట్లలో 6.50 లక్షల సీఎన్జీ కార్లు అమ్ముడయ్యాయి. సంచిత విక్రయాలతో (Cumulative sales) పోల్చుకుంటే 6,60,153 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో సీఎన్జీ వేరియంట్ కార్లు 46 శాతం పెరగడం ఇదే తొలిసారి.
తక్కువ ఖర్చుతోపాటు అధిక పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే గ్రీనరీ ఫ్యూయల్గా పరిగణించే సీఎన్జీ వేరియంట్ కార్లకు క్రమంగా గిరాకీ పెరుగుతుంది. ఈ నెల ఏడో తేదీన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.29, లీటర్ డీజిల్ ధర రూ.94.25, సీఎన్జీ గ్యాస్ కిలో కేవలం రూ.87 మాత్రమే. పెట్రోల్, డీజిల్లతో పోలిస్తే పర్యావరణ బెనిఫిట్ల కంటే ఫ్యుయల్ కోసం మనీ ఖర్చు తగ్గుతున్నదని వినియోగదారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎన్జీ గ్యాస్పై కిలోకు రూ.8 తగ్గించాయి కేంద్ర చమురు సంస్థలు. దీని ప్రకారం ఇప్పుడు కిలో సీఎన్జీ రూ.79లకే లభిస్తుంది. పెట్రోల్ కంటే రూ.27.29, డీజిల్ కంటే రూ.15.25 తక్కువ.
అయితే, గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో పెట్రోల్తో సీఎన్జీ గ్యాస్ ధరలో వ్యత్యాసం క్రమంగా తగ్గుతున్నది. ఫలితంగా గత జూన్ నుంచి సీఎన్జీ కార్లకు డిమాండ్ తగ్గుతున్నదని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త మోడల్ కార్లు సీఎన్జీ వేరియంట్లలో విడుదల చేసింది మారుతి సుజుకి. ఫలితంగా సీఎన్జీ వేరియంట్ కార్ల సేల్స్ 15.5 శాతం నుంచి 19 శాతానికి పెరిగాయన్నారు శశాంక్ శ్రీవాత్సవ. పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీ కార్లకు గిరాకీ పెరుగుతుందన్నారు.