హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో భూపాలపల్లి ఏరియా ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నదని, సమష్టి కృషితో లాభాల బాటలోకి తీసుకురావాలని ఆ సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ సూచించారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-2 ఓసీ గని, కేటీకే-3 ఓసీ గనిని సీఎండీ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ… బ్లెండింగ్ ప్రక్రియ ద్వారా జీ-5 గ్రేడు బొగ్గు చేకూరేలా ప్రయోగాత్మకంగా ఒక ప్లాంటును భూపాలపల్లిలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గనులకు అవసరమైన ఇసుకను సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు.
ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయ వనరులు పెంచడం కోసం ఇక్కడే మరో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. కేటీకే-2 ఓపెన్ కాస్ట్ గని పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మూడేండ్లలో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఈ గనికి కావలసిన భూసేకరణ పనులను ఆరునెలల్లో పూర్తిచేసి ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నారు.