CloudSEK on Malware | కంప్యూటర్లపై పని చేస్తున్న యూజర్ల డేటాను తస్కరించడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో మాల్వేర్ వ్యాపింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి వరకు నకిలీ ఆండ్రాయిడ్ యాప్ల ద్వారా గెరిల్లా మాల్ వేర్, దామ్ వైరస్లతో యూజర్ల ఫోన్లు హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై యూజర్లను జాతీయ సైబర్ సెక్యూరిటీ విభాగం సెర్ట్-ఇన్ అలర్ట్ చేసింది.
తాజాగా హ్యాకర్లు.. డోగేరాట్ అనే పేరుతో మరో మాల్వేర్ను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ ల ద్వారా యూజర్ల డివైజ్ల్లో ప్రవేశ పెడుతున్నారని సైబర్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్ తెలిపారు. ఈ మాల్వేర్ సాయంతో హ్యాకర్లు ఆర్థిక రంగం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఈ-కామర్స్, వినోద రంగాల్లో పని చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల డివైజ్ల్లో గల సమాచారం లక్ష్యంగా హ్యాకర్లు ఎంచుకున్నారని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న క్లౌడ్ సెక్ అనే సంస్థ తెలిపింది.
యూ-ట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ఇన్ స్టాగ్రామ్, ఒపెరా మినీ, టెలిగ్రాం వంటి పాపులర్ ప్లాట్ ఫామ్స్ ద్వారా యూజర్ల డివైజ్ల్లోకి హ్యాకర్లు ఈ మాల్వేర్ ప్రవేశ పెడుతున్నారు. డివైజ్ల్లోకి ఎంటరయ్యాక డోగేరాట్.. యూజర్ల పర్మిషన్ లేకుండానే రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో గల నంబర్లకు స్పామ్ మెసేజ్ లు పంపడం, నగదు పేమెంట్స్, కాల్ రికార్డింగ్ వినడం, ఫొటోలు, వీడియోలు తీయడానికి హ్యాకర్లకు ఉపయోగ పడుతుందని క్లౌడ్సెక్ తెలిపింది.
కనుక సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే డైరెక్ట్ మెసేజ్లు, వెబ్ లింక్ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది క్లౌడ్ సెక్. ఎప్పటికప్పుడు డివైజ్ ఓఎస్ అప్ డేట్ చేసుకోవడంతోపాటు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేసుకోవడం మంచిదని పేర్కొంది.