న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో వివిధ కార్ల తయారీ సంస్థలు 63 నుంచి 71 లక్షల కార్ల ఉత్పత్తిలో కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి వచ్చే ఏడాది (2022) ద్వితీయార్థం వరకూ కొనసాగొచ్చునని ఐహెచ్ఎస్ మార్కిట్ ఆందోళన వ్యక్తం చేసింది.
టయోటా మోటార్ కార్పొరేషన్ తాజాగా 40 శాతం ప్రొడక్షన్ నిలిపేయడంతోపాటు వచ్చేనెలలో 14 ప్లాంట్లలో పాక్షికంగా నిలిపివేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు భారీ మొత్తంలో చిప్లను నిల్వ చేసుకోవడంతో సెమీ కండక్టర్ల కొరత ఆ సంస్థ కార్ల తయారీపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఆసియా ఖండ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరగడంతో వచ్చే నెలలో ఉత్పత్తిలో కోత విధిస్తున్నది.
ఫోర్డ్ మోటార్స్ సంస్థ.. మిస్సోరీలో కన్సాస్ సిటీకి సమీపంలోని ఎఫ్-150 పికప్ ప్లాంట్ వచ్చేవారం మూత పడుతుందని బుధవారమే తెలిపింది. మలేషియాలో కోవిండ్ ఆంక్షల ప్రభావంతో సెమీ కండక్టర్ల కొరత నెలకొందని వెల్లడించింది.
గతేడాది కరోనా మహమ్మారితో అమలులోకి వచ్చిన ఆంక్షలు.. తాత్కాలికంగా ఫ్యాక్టరీల మూసివేత.. వర్క్ ఫ్రం హోం అండ్ లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్తో టాబ్లెట్లు, లాప్టాప్లు, కంప్యూటర్లకు పెరిగిన డిమాండ్.. చిప్లు, సెమీ కండక్టర్ల కొరతకు దారి తీసింది.
చిప్ల కొరత వల్ల ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 21 లక్షల కార్ల ఉత్పత్తి నిలిచిపోనున్నది. 2022 రెండో త్రైమాసికంలో చిప్ల సరఫరాలో స్థిరత్వం వస్తుందని భావిస్తున్నట్లు ఐహెచ్ఎస్ తెలిపింది.