Chinese Plane | చైనా నుంచి సింగపూర్ వెళుతున్న `ఎయిర్ చైనా` విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 155 మంది ప్రయాణిస్తున్నారు. చైనాలోని చెంగ్డూ విమానాశ్రయం నుంచి సింగపూర్ లోని చాంగి విమానాశ్రయానికి `సీఏ403` విమానం బయలుదేరింది. విమానం గాల్లో ఉన్నప్పుడే ఎడమ వైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన క్రూ సిబ్బంది ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు సింగపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంజిన్లో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు, క్యాబిన్లో కమ్ముకున్న పొగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పొగ వల్ల కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. విమానం నుంచి అత్యవసరంగా ప్రయాణికులను దింపుతున్నప్పుడు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సింగపూర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ రియాక్టయింది. ఈ విమానంలో 146 మంది ప్రయాణికులతోపాటు తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ నేపథ్యంలో ఆ రన్వే మూసేశారు. అదే సమయంలో ల్యాండిగ్ కావాల్సిన మరో విమానాన్ని ఇండోనేసియాలోని బాటం ద్వీపానికి మళ్లించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు సింగపూర్ ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. చైనా అధికారులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. కానీ, ఈ ప్రమాదంపై ఎయిర్ చైనా ఇంకా స్పందించలేదు.