China Vs India | చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు.. భారత్ను వీడనున్నాయా.. ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా.. అంటే అవుననే అంటున్నది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు.. చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు షియోమీ, వివో, ఒప్పో వంటి సంస్థలు.. భారత్ను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని డ్రాగన్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
దేశీయ మొబైల్ కంపెనీల మార్కెట్ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నదని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్లో 20 మిలియన్ల డాలర్ల విలువ గల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈజిప్ట్తోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నాయి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు. ఒప్పో, వివో ఇండియా, షియోమీ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. పన్ను ఎగవేత పాల్పడ్డాయంటూ ఈ మూడు సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నోటీసులు కూడా జారీ చేసింది.
టెన్సెంట్స్ వారి వీచాట్, బైట్ డ్యాన్స్ వారి టిక్టాక్ సహా 300కి పైగా చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. మరోవైపు స్మార్ట్ ఫోన్ల తయారీలో స్వావలంభన సాధించడానికి సన్నాహాలు చేస్తున్నది. స్మార్ట్ ఫోన్లలో కీలకమైన చిప్ మాన్యుఫాక్చరింగ్ కూడా దేశంలోకి తేవడానికి కసరత్తు జరిగింది. ఇందుకోసం వేదాంతా, ఫాక్స్కాన్ సంస్థలతో రూ.1.54 లక్షల కోట్ల విలువ గల సెమీ కండక్టర్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గుజరాత్ సర్కార్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇక టెక్ దిగ్గజం ఆపిల్ వారి ఐఫోన్లను భారత్లో తయారు చేయడానికి తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న విస్ట్రన్ సంస్థతో టాటా సన్స్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.