(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పక్కలో బల్లెంలా.. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న దేశమది. గల్వాన్లో 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్నది. అంతేకాదు.. భారత భూభాగాలను తమవిగా చెప్పుకొని తరుచూ రెచ్చగొడుతుంది. అలాంటి చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో అదానీ గ్రూప్ ప్రమోటర్లు సత్సంబంధాలను కలిగివున్నారు. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.. జాతీయవాదం పేరిట కూనిరాగాలు తీసిన సదరు గ్రూప్.. తీరాచూస్తే, మన జవాన్ల ప్రాణాలను తీస్తున్న ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది. అదానీ గ్రూప్నకు చెందిన నాలుగు కంపెనీల్లో చైనాకు చెందిన చంగ్ చుంగ్-లింగ్కు 13.5 శాతం వాటా ఉన్నట్టు, అదానీ కుటుంబంతో అతను దశాబ్దాలుగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఓ కుటుంబసభ్యుడిగా మెదులుతున్నట్టు ఓసీసీఆర్పీ తాజా నివేదికలో వెలుగుచూడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది.