కోల్కతా, జూన్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ వృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలు ఒకేలా ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు. శనివారం ఇక్కడ భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసారి జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ అంచనా వేసిన విషయం తెలిసిందే. కాగా, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను దేశ ఆర్థిక వ్యవస్థ అధిగమించగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరలు భారత్కు లాభించగలవని, దేశీయ స్థూల ఆర్థిక సుస్థిరతకు ఇది దోహదం చేయగలదన్నారు.
ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2022-23) జీడీపీ 7.2 శాతంగానే నమోదైందని, ఇంకా ఎక్కువగా ఉంటుందని తాను ఆశించినట్టు చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) 9.1 శాతంగా ఉన్నట్టు గుర్తుచేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం శుభ సంకేతాలతో మొదలైందన్న ఆయన ప్రస్తుతం ప్రపంచంలోని వేగవంతమైన వృద్ధిరేటు గల దేశాల్లో భారత్ కూడా ఒకటన్నారు. గత ఆర్థిక సంవత్సరం వస్తు, సేవల ఎగుమతుల విలువ జీడీపీలో 23.5 శాతంగా ఉందన్నారు. 2015 నుంచి ఇదే అత్యధికమని పేర్కొన్నారు. ఇక ఎల్నినో భయాందోళనలు అక్కర్లేదని, దేశంలోని రిజర్వాయర్లలో తగినన్ని నీటి నిల్వలున్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులకూ కొరత లేదని స్పష్టం చేశారు. నిర్మాణ రంగ కార్యకలాపాలు బాగున్నాయని, సిమెంట్, ఉక్కు ఉత్పత్తి పెరిగిందని వెల్లడించారు. దేశంలోకి కరోనా కంటే ముందున్న స్థాయికి పర్యాటకుల రాక కనిపిస్తున్నదని, దీంతో ఆతిథ్య రంగం వృద్ధిపథంలో నడుస్తున్నదని చెప్పారు.