మాదాపూర్, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదని చేవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే పౌల్ట్రీ ఇండస్ట్రీతోనే సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం, అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గుడ్లను అందిస్తున్నట్లు చెప్పారు. కరోనాతోపాటు ఇతర సమస్యల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో పౌల్ట్రీ రైతులకు వ్యవసాయ హోదా కల్పించి సబ్సిడీలను అందించాలని పౌల్ట్రీ పరిశ్రమ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు డాక్టర్ తిరుపతి రెడ్డి, హర్షరెడ్డి, రాంరెడ్డి, పౌల్ట్రీ రైతులు తదితరులు పాల్గొన్నారు.