Budget 2022 | ప్రతిఏటా కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తారు. మన ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉంటుంది. గతంలో ఫిబ్రవరి నెలాఖరు రోజు బడ్జెట్ సమర్పించేవారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత దాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీకి జరిపారు. 2019లో ప్రధాని మోదీ సారధ్యంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఇప్పటివరకు మూడు వార్షిక బడ్జెట్లను ప్రవేశ పెట్టారు. తాజాగా వచ్చేనెల ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ నాలుగో బడ్జెట్ సమర్పిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలను 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు సమర్పిస్తారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి 2020 బడ్జెట్ ప్రసంగం అత్యధిక టైం తీసుకున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుమారుగా 2.40 గంటలపాటు ప్రసంగించారు. 160 నిమిషాలు ప్రసంగించినా.. ఆమె చివరిలో రెండు పేజీలు చదవకుండానే ముగించారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్రీకరిస్తారని భావిస్తున్నారు. భవిష్యత్లో వచ్చే మహమ్మారుల భారీ నుంచి జాతిని కాపాడేందుకు హెల్త్కేర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవచ్చునని తెలుస్తున్నది.
2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభ టీవీ (ఇతర న్యూస్ చానెళ్లు), యూట్యూబ్, ట్విట్టర్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పిస్తారు.
సర్చార్జీలు, పన్నుల నుంచి బడ్జెట్లో మినహాయింపులు లభిస్తాయని పన్ను చెల్లింపుదారులు అంచనా వేస్తున్నారు. ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద మినహాయింపు పెంచుతారని ఆశిస్తున్నారు. ఇంటి రుణం రీపేమెంట్పై రాయితీ, డివిడెండ్పై పన్ను రిలీఫ్, వివిధ రకాల ఆస్తులకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ హేతుబద్ధీకరణ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ రద్దు, సామాన్యులకు అందించే సర్వీసులపై జీఎస్టీ రద్దు చేసి ఊరటనిస్తారని అంచనా వేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల చేతిలో మరింత నగదు ఉండేలా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందా.. లేదా.. అనేది జాతీయ ప్రాధాన్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను రాయితీని రూ.2.5 లక్షలకు పెంచుతారని మధ్య తరగతి ప్రజలు ఆశిస్తున్నారు. సగటు పన్ను చెల్లింపుదారుడిపై భారం తగ్గించడంతోపాటు ప్రభుత్వానికి సాయంగా ఉంటుందని తెలుస్తున్నది.
ఆదాయం పన్ను చట్టం 80డీ సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుత మినహాయింపుల వల్ల ప్రజానీకం తమ అవసరాలకు సరిపడా హెల్త్ బీమా పాలసీ తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 80డీ సెక్షన్ కింద ప్రభుత్వం రెండు అబ్జెక్టివ్స్ ( objectives ) కలిగి ఉండాలని అంటున్నారు. ప్రజల్లో హెల్త్బీమా పాలసీ కొనుగోళ్లను ప్రోత్సహించాలి. ప్రజలు తమ బీమా అవసరాలకు సరిపడా పాలసీ కొనుక్కునేలా చేయాలి. ఈ లక్ష్య సాధనకు 80డీ సెక్షన్ కింద మినహాయింపులు రెట్టింపు చేయాలని కోరుతున్నారు.
పిల్లల విద్య కోసం ఆదాయం పన్నులో టాక్స్ రిలీఫ్ కోసం స్టాండర్డ్ డిడక్షన్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏండ్ల తరబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే పిల్లల విద్య అవసరాలకు సంబంధించి పన్ను రిలీఫ్ తక్కువగా ఉంది. ప్రస్తుతం వేతన జీవుల జీవన వ్యయం కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పిల్లల ఉన్నత విద్య ప్రతి పన్నుచెల్లింపుదారుడికి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. ప్రతిఒక్కరూ తమ పిల్లల కోసం తమ ఆదాయంలో గణనీయ భాగం పొదుపు చేయాల్సి ఉంటుంది. బాలికల కోసం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకం మినహా ప్రస్తుతం పిల్లల కోసం పొదుపుపై మినహాయింపుల్లేవు.
కరోనాతో వర్క్ ఫ్రం హోం సంస్కృతి అమలులోకి వచ్చింది. ఇందుకోసం ఆయా కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న వర్క్ ఫ్రం హోం అలవెన్స్కు ప్రస్తుతం అమలులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపజేయలేం. కనుక వర్క్ ఫ్రం హోం అలవెన్స్ కోసం కొత్తగా నిబంధన చేర్చడం గానీ, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచడం గానీ చేయాలని కోరుతున్నారు. వర్క్ ఫ్రం హోం ఆఫీసు ఖర్చులపై భారీ డిడక్షన్ కల్పిస్తే వారికి రిలీఫ్ ఇచ్చినట్లవుతుంది. పన్ను మినహాయింపు కోసం అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం రాకపోవచ్చు.