న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి. అదానీ గ్రూప్ నిర్వహణలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చే చార్టర్డ్ ఫ్లైట్స్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలను హఠాత్తుగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ చార్జీలను 10 రెట్లు పెంచేసినట్టు ఎయిర్లైన్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అందిన ఫిర్యాదులపై ఎయిర్పోర్ట్ ఎకానమీ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) స్పందిస్తూ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ వివాదాన్ని నేరుగా పరిష్కరించేందుకు తమతో తక్షణమే సమావేశమవ్వాలని ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల నిర్వహణా సంస్థలూ తన అనుమతి లేకుండా చార్జీలు పెంచరాదన్నది.
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత చార్జీల పెంపుపై టారీఫ్ లిస్ట్ను సెప్టెంబర్లోనే విడుదల చేసింది. 15 మందికిపైగా ప్రయాణీకులతో కూడిన చార్టర్డ్ ఫ్లైట్స్కు కనీసం రూ.2,65,000 జనరల్ ఏవియేషన్ చార్జీలను, ఇందుకు అదనంగా 15 మంది తర్వాత ప్రతీ ఒక్క ప్రయాణీకుడికి రూ.17,667 చొప్పున చార్జీ విధించింది. గత ఐపీఎల్ సందర్భంగా పాసింజర్కు రూ.6,000 చొప్పున వసూలు చేసిన అనుబంధ చార్జీలను కూడా తాజా చార్జీలకు కలిపింది. ఈ చార్జీలన్నీ ల్యాండింగ్, పార్కింగ్ ఫీజులకు అదనం.