మీరు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మదుపరా? అయితే మీ ఎన్పీఎస్ ఖాతాపై ఎంత చార్జీలు పడుతున్నాయి.. వాటిని ఎలా వసూలు చేసుకుంటున్నారు.. అన్నది తెలుసుకోవాల్సిందే. ఎన్పీఎస్ పథకం నిబంధనల ప్రకారం మూడు రకాల చార్జీలుంటాయి. అవి.. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ చార్జీలు, వార్షిక నిర్వహణ చార్జీలు. ఎన్పీఎస్ ఖాతాను తెరిచినప్పుడు అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు వర్తిస్తాయి. ఇక మీ ద్వారా ఏదైనా ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ జరిగినప్పుడు లావాదేవీ చార్జీలను వేస్తారు. మీ ఎన్పీఎస్ ఖాతాలోకి మీ ద్వారా ఏదైనా నగదు చేరితే దానికి ఆర్థిక లావాదేవీ చార్జీలు పడుతాయి. అలాగే బ్యాంక్ అకౌంట్ మార్పు వంటివేవైనా జరిగితే ఆర్థికేతర లావాదేవీ చార్జీలుంటాయి. ఖాతా నిర్వహణార్థం ఏటా చార్జీలను వసూలు చేస్తారు. వీటినే వార్షిక నిర్వహణ చార్జీలంటారు.
చార్జీల మినహాయింపు ఇలా..
ఈ ఏడాది సెప్టెంబర్లో మీరు ఎన్పీఎస్ ఖాతాను తెరిచారనుకుందాం. అలాగే టైర్-1, టైర్-2 ఖాతాల్లో నగదు జమతో ఆన్లైన్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్)ను తీసుకుంటే రూ.48.68 చార్జీ పడుతుంది. రూ.41.25 సీఆర్ఏ చార్జీలవగా, మిగతా రూ.7.43 పన్నులు. రూ.41.25లో రూ.18 రిజిస్ట్రేషన్ కోసమైతే, రూ.3.5 చొప్పున మొత్తం రూ.7 రెండు ఖాతాల్లో డిపాజిట్ కోసం ఉంటుంది. మరో రూ.16.15 వార్షిక నిర్వహణ చార్జీ. ఈ చార్జీలు పథకాన్నిబట్టి ఉండవు. సబ్స్ర్కైబర్ ఖాతాలోని యూనిట్ల ఆధారంగానే ఉంటాయి. అంటే.. మీ పథకంలోని సొమ్మును ఈక్విటీల్లో 50 శాతం, కార్పొరేట్ బాండ్లలో 25 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 25 శాతం పెట్టారనుకుందాం. ఇప్పుడు ఈక్విటీ నుంచి రూ.25.39, కార్పొరేట్ బాండ్ల నుంచి రూ.14.81, ప్రభుత్వ సెక్యూరిటీల నుంచి రూ.8.48 చార్జీలుగా తీసుకుంటారు. ఈ మొత్తం రూ.48.68కి సమానం.